గజిని దర్శకుడి విచిత్రమైన లాజిక్

ఆడలేక మద్దెల ఓడు అన్నది పాత సామెత. అంటే ఒక పని చేతకానప్పుడు ఏదో సాకుని వెతికే వాళ్లను ఉద్దేశించి దీన్ని రాశారు. తమిళ దర్శకులకు ఇది సరిగ్గా వర్తిస్తుంది. గజిని, తుపాకీలతో తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేసిన మదరాసి వచ్చే నెల సెప్టెంబర్ 5 విడుదలకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఆయన ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అందులో భాగంగా వెయ్యి కోట్లకు వసూలు చేసే ఇతర బాషల ప్యాన్ ఇండియా సినిమాల ప్రస్తావన వచ్చింది. కోలీవుడ్ లో అలాంటివి ఎందుకు తీయలేకపోతున్నారంటే దానికాయన చెప్పిన సమాధానం మహా విచిత్రంగా ఉంది.

వెయ్యి కోట్ల సినిమాలు తీసే దర్శకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రేక్షకులను కేవలం ఎంటర్ టైన్ మాత్రమే చేస్తారని, కానీ  తమిళ డైరెక్టర్లు ఎడ్యుకేట్ చేస్తారని సెలవిచ్చారు. ఇదే ఇద్దరి మధ్య వ్యత్యాసమని చెప్పుకొచ్చారు. వినగానే నవ్వొచ్చే స్టేట్ మెంట్ ఇది. ఎక్కడి దాకో ఎందుకు ఈయనే తీసిన సికందర్ లో ఎలాంటి మెసేజ్ ఉందో చెబితే వినొచ్చు. దాన్ని ఆడియన్స్ ఎందుకు తిరస్కరించారో వివరిస్తే నేరుకోవచ్చు. ఇటీవలే విడుదలైన కూలీలో లోకేష్ కనగరాజ్ ఏం నేర్పించాడు. ది వారియర్ లో లింగుస్వామి, కస్టడీలో వెంకట్ ప్రభు ఏం ఎడ్యుకేట్ చేశారో తెలియదు కానీ నిర్మాతలనైతే నష్టాల్లో ముంచేశారు.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఏ భాషలో అయినా సినిమాలు తీసేది బిజినెస్ కోసమే తప్ప సమాజాన్ని ఉద్దరించడానికి లేదు. ఆ మాటకొస్తే మదరాసి కూడా యాక్షన్ ఎంటర్ టైనరే. పన్ను రాయితీలు ఇచ్చి స్కూల్ పిల్లలకు, కాలేజీ విద్యార్థులకు ఉచితంగా షోలు వేయరు కదా. అలాంటప్పుడు ఇలాంటి మాటలు ఖచ్చితంగా ట్రోలింగ్ కు దారి తీస్తాయి. పదే పదే కులవివక్ష మీద సినిమాలు తీస్తూ జనాలకు క్లాసులు పీకే బ్యాచి కన్నా ప్రొడ్యూసర్లకు నాలుగు డబ్బులొచ్చేలా చేసే దర్శకులు టాలీవుడ్ లోనే ఎక్కువగా ఉన్నారు. తమిళంలో వెయ్యి కోట్ల సినిమా రాదేమోననే ఫ్రస్ట్రేషన్ ఇలా అందరినీ పక్కదోవ పట్టిస్తోంది.