విషంగా మారుతున్న టికెట్ రేట్ల అమృతం

హిట్టు ఫ్లాపు అందరు హీరోలకు, నిర్మాతలకు సహజం. దీనికి ఎవరూ అతీతులు కాదు. రాజమౌళి, అనిల్ రావిపూడి లాంటి ఒకరిద్దరు తప్ప పరాజయం చూడని వాళ్ళు ఇండస్ట్రీలో ఉండరు. అయితే కొత్త సినిమాల రిలీజుల సందర్భాల్లో నిర్మాతలు అనుసరిస్తున్న టికెట్ రేట్ల పెంపు పద్ధతి మొదట అమృతంగా కనిపించి ఇప్పుడు విషంగా మారుతోంది. టాక్ ఏంటో చూశాక, పబ్లిక్ తీర్పు తెలిశాక కూడా వీకెండ్ తర్వాత సాధారణ రోజుల్లో తగ్గించే ప్రయత్నాలు చేయకపోవడం ప్రొడ్యూసర్లకు తీరని నష్టం కలిగిస్తోంది. గేమ్ ఛేంజర్ నుంచి వార్ 2 దాకా అందరూ జిఓల పేరుతో ఆడుతున్న డేంజరస్ గేమ్ కలెక్షన్లను తినేస్తోంది.

గత ఏడాదికి పైగా ఈ తంతు నడుస్తూనే ఉంది. పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్లకు ఎలాంటి ఇబ్బంది లేదు. వంద నుంచి నూటా యాభై దాకా ప్రతి టికెట్ మీద ఎంత పెంచినా ప్రేక్షకులు భరిస్తున్నారు, వసూళ్లు ఇస్తున్నారు. కానీ యావరేజ్ లేదా డిజాస్టర్లకు ఈ విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గేమ్ ఛేంజర్ నాలుగో రోజుకే క్రాష్ అయినా, డాకు మహారాజ్ పండగ సీజన్ ని పూర్తిగా క్యాష్ చేసుకోలేకపోయినా, హిట్ 3 ది థర్డ్ కేస్ పూర్తి స్టామినా బయట పడకపోయినా దానికి యునానిమస్ గా ఒకటే కారణం. టికెట్ రేట్ల పెంపు వారం నుంచి పది రోజుల దాకా అలాగే అమలులో ఉండటం.

సినిమా ఫలితం గురించి వాస్తవ పరిస్థితి బోధపడ్డాక డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు వెంటనే మేల్కొని సోమవారాల నుంచి టికెట్ రేట్లు సాధారణ స్థితికి తీసుకొచ్చే చొరవ తీసుకోవడం లేదు. కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చేసి మిగిలినవి అలాగే వదిలేస్తున్నారు. దీంతో జనాలు థియేటర్లకు దూరంగా ఉంటున్నారు. తీరా పది రోజుల తర్వాత పాత ధరలు పెట్టినా అబ్బే త్వరలో ఓటిటిలో వస్తుంది కదా ఇంకేం చూస్తాం లెమ్మని లైట్ తీసుకుంటున్నారు. జిఓలు తీసుకోవడం వరకు బాగానే ఉంది కానీ ఖచ్చితంగా పది రోజులు పెంచిన రేట్లే పెట్టమని ప్రభుత్వాలు ఒత్తిడి చేయడం లేదు. అలాంటప్పుడు పరిష్కారం నిర్మాతల చేతుల్లో ఉందనేది స్పష్టం. ఇకనైనా ప్యాన్ ఇండియా మూవీస్ త్వరగా కిల్ అవ్వకూడదంటే చర్యలు తీసుకోవాల్సిందే.