పూరీ చెప్పినట్టు స్టోరీ మారిపోయిందా?

లాక్‍ డౌన్‍కి ముందు రాసుకున్న కథలు ఏమైనా వుంటే వాటిని చింపేయాలని పూరి జగన్నాథ్‍ సూచించాడు. లాక్‍డౌన్‍ టైమ్‍లో మామూలుగా కంటే ఎక్కువ శాతం సినిమా ప్రియులు వరల్డ్ సినిమా చూసారని, గతంలో ఇరవై శాతం మందికి మాత్రం అది తెలిస్తే ఇప్పుడు యాభై శాతం వరకు సినీ ప్రియులు అన్ని భాషల సినిమాలను ఓటిటిల్లో చూస్తున్నారని, దీని వల్ల గ్లోబల్‍ ఆడియన్స్ని దృష్టిలో వుంచుకుని ఒక కథ రాసుకోవాలని, కేవలం తెలుగు సినిమా బి, సి సెంటర్ల ఆడియన్స్ కోసం సినిమా చేస్తామంటే ఇకపై చెల్లదని, సినిమా భవిష్యత్తు థియేటర్ల కంటే ఓటిటిలోనే వుందని పూరి చెబుతున్నాడు.

పూరి చెబుతున్నట్టుగా తెలుగు సినిమా స్టోరీ నిజంగా మారిపోవాలా? మునుపు చేసినట్టు మాస్‍ సినిమాలు ఇప్పుడు చేస్తే కుదరదా? ఆయన చెబుతోన్నది లో బడ్జెట్‍ సినిమాలకు సరిపోతుంది కానీ భారీ బడ్జెట్‍ సినిమాలను థియేటర్లకు వచ్చే ప్రేక్షకులను దృష్టిలో వుంచుకునే చేయాల్సి వుంటుంది. ఉదాహరణకు విజయ్‍ ‘మాస్టర్‍’ సినిమా టీజర్‍ చూస్తే దానిని ఓటిటిలో ఇంట్లో కూర్చుని చూస్తూ ఎంజాయ్‍ చేయగలమా? మాస్‍ ప్రేక్షకుల ఈలలు, కేరింతలు లేకుండా అలాంటి సినిమా టీవీలో చూస్తే మెప్పిస్తుందా? ఫ్రెష్‍గా ఇప్పుడే లాక్‍డౌన్‍ నుంచి బయటకు వస్తున్నారు కనుక లోకం అంతా మారిపోయిందనే ఫీలింగ్‍ సహజం కానీ ఒక ఆరు నెలలు పోయి అంతా మామూలైపోతే సినిమా కూడా పూర్వ స్థితికి చేరుకోవడం తథ్యం.