ఇప్పటికే పలు వాయిదాలు, బ్రేకుల మధ్య నలిగిపోయిన ది రాజా సాబ్ మరో కొత్త వివాదంలో చిక్కుకుంది. ప్రొడక్షన్ పార్ట్ నర్ గా వ్యవహరిస్తున్న ఐవి(ivy) ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఢిల్లీ హై కోర్టులో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మీద కేసు వేయడం సంచలనం రేపుతోంది. తమతో చేసుకున్న ఒప్పందం ప్రకారం సదరు ప్రొడక్షన్ హౌస్ వ్యవహరించలేదని, అందుకే తాము పెట్టుబడిగా పెట్టిన 218 కోట్లను వెనక్కు ఇప్పించాల్సిందిగా కోరుతూ పలు అభియోగాలు చేసింది. సమయానికి పూర్తి చేయకపోవడం, అప్డేట్స్ ఇవ్వకపోవడం, పెట్టిన ఖర్చుకు సంబంధించి లెక్కలు చూపించకపోవడం వాటిలో ప్రధానమైనవి.
నిధుల వాడకం గురించి కూడా ఐవి ప్రశ్నిస్తోంది. దీనికి సంబంధించి విశ్వప్రసాద్ ఇంకా స్పందించలేదు కానీ లీగల్ గా యాక్టివ్ గా ఉండటంతో పాటు మంచి పరిజ్ఞానం ఉన్న ఆయన దీనికి ఏం సమాధానం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికీ రాజా సాబ్ డిసెంబర్ 5 విడుదలవుతుందా లేదా అని గ్యారెంటీగా తెలియడం లేదు. సంక్రాంతి అయితే బాగుంటుందని తెలుగు బయ్యర్లు కోరుతున్నారని ఇటీవలే విశ్వప్రసాద్ పలు ఇంటర్వ్యూలలో చెప్పిన సంగతి తెలిసిందే. ఈలోగా ఇప్పుడీ బాంబు లాంటి వార్త వచ్చి పడింది. అయితే దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందా లేదాని చెప్పలేం.
ప్రభాస్ అభిమానులు ఈ పరిణామాల పట్ల టెన్షన్ పడుతున్నారు. అసలే లేట్ అయ్యిందని ఆందోళన చెందుతుంటే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇప్పుడీ కేస్ ఏంటని చర్చించుకుంటున్నారు. ఏప్రిల్ లోనే విడుదల కావాల్సిన రాజా సాబ్ షూటింగ్ తో పాటు పాటల చిత్రీకరణ వల్ల పెండింగ్ పడుతూ వచ్చింది. దర్శకుడు మారుతీ ఎప్పటికప్పుడు ప్రాజెక్టు గురించి ఊరిస్తూ వచ్చారు తప్పించి మధ్యలో కొన్ని నెలల పాటు అప్డేట్స్ ఆగిపోయాయి. దీనికన్నా లేట్ గా మొదలైన ఫౌజీ వేగంగా పరుగులు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. మరి ఇప్పుడీ ఐవి చేసిన ఆరోపణలకు పీపుల్స్ మీడియా ఏమంటుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates