సౌత్ క్యారెక్టర్లే గొప్ప అన్న పూజా హెగ్డే

సౌత్‌లో కొన్ని సినిమాలు చేసి బాలీవుడ్‌కు వెళ్లే హీరోయిన్లందరూ.. ఇక్కడి సినిమాలను తక్కువ చేసి మాట్లాడ్డం ఎన్నో సందర్భాల్లో జరిగింది. చాలామంది ఇక్కడి సినిమాలను డీగ్రేడ్ చేసిన వాళ్లే. కెరీర్ బాగున్నంత కాలం తమ వద్దకు వచ్చే గ్లామర్ పాత్రలకు ఓకే చెప్పి సినిమాల్లో నటిస్తారు. కానీ ఇక్కడ డౌన్ అయి అక్కడ కొన్ని మంచి పాత్రలు పడగానే.. సౌత్ వాళ్లు తమ టాలెంట్‌ను గుర్తించలేదని.. గ్లామర్ డాల్ లాగా చూశారని.. సరైన పాత్రలు ఇవ్వలేదని బురదజల్లే ప్రయత్నం చేస్తారు. ఐతే పూజా హెగ్డే మాత్రం దీనికి భిన్నంగా మాట్లాడి ఆశ్చర్యపరిచింది. ఆమె స్వతహాగా బాలీవుడ్ హీరోయినే. కానీ తెలుగు, తమిళంలోనే మంచి పాత్రలు పడ్డాయి.

హిట్లు కూడా ఇక్కడే వచ్చాయి. ఐతే ఈ మధ్య తెలుగులో ఆమెకు ఛాన్సులు తగ్గాయి. తమిళంలో కొంచెం బిజీ అయింది. హిందీలో కూడా అవకాశాలకు లోటు లేదు.
ఐతే ఒక ఇంటర్వ్యూలో పూజా మాట్లాడుతూ.. బాలీవుడ్ తనకు సరైన పాత్రలు ఇవ్వలేదని వాపోయింది. అక్కడి వాళ్లు తనను గ్లామర్ హీరోయిన్ లాగే చూశారని.. పెద్దగా గుర్తింపు లేని పాత్రలే ఇచ్చారని వ్యాఖ్యానించింది.

కానీ సౌత్ సినిమాల్లో మాత్రం తనకు మంచి మంచి క్యారెక్టర్లు దొరికాయని ఆమె చెప్పింది. చివరగా తాను నటించిన ‘రెట్రో’ సినిమాలో కార్తీక్ సుబ్బరాజ్ అద్భుతమైన పాత్ర డిజైన్ చేశాడని.. తాను ఎలా పెర్ఫామ్ చేయగలనో ఆ సినిమా చూపించిందని ఆమె చెప్పింది. ఇలాంటి పాత్రలు మరిన్ని చేయాలని ఉందని పూజా పేర్కొంది. తెలుగులో కూడా పూజా అరవింద సమేత, రాధేశ్యామ్ లాంటి చిత్రాల్లో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేసింది. బాలీవుడ్లో మాత్రం ‘మొహెంజదారో’లో మినహాయిస్తే దాదాపుగా అన్నీ గ్లామర్ క్యారెక్టర్లే చేసింది పూజా.