నిర్మాత ప్రశ్న: ఒక్కరైనా 10 కోట్లు సంపాదించారా?

తమ వేతనాలు 30 శాతం పెంచాలంటూ సినీ కార్మికులు చేస్తున్న సమ్మె టాలీవుడ్‌ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ సమ్మె వల్ల గత కొన్ని రోజులుగా షూటింగ్స్ ఆగిపోయాయి. ఇప్పటికే సినిమా సక్సెస్ రేట్ తగ్గిపోయి.. నష్టాలు పెరిగిపోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న నిర్మాతలు.. ఇప్పుడిలా జీతాలు పెంచితే అది మోయలేని భారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో మూడేళ్లుగా జీతాలు పెంచని నేపథ్యంలో పెరుగుతున్న ధరల మధ్య తామెలా బతకాలని కార్మికులు అంటున్నారు. ఈ నేపథ్యంలో మధ్యే మార్గంలో ఫిలిం ఛాంబర్ కొన్ని ప్రతిపాదనలు చేయగా.. దాని మీద అంగీకారం కుదరట్లేదు. ఈ పరిస్థితుల్లో టాలీవుడ్లో చిన్న నిర్మాతలు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో హనుమాన్ ప్రొడ్యూసర్ చైతన్య నిర్మాతల దీన స్థితి గురించి మాట్లాడారు.

కొవిడ్ తర్వాత నిర్మాతల పరిస్థితి దుర్భరంగా మారిందని.. లాభాలు అందుకుంటున్న సినిమాలు బాగా తగ్గిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండేళ్లలో పరిస్థితి మరి ఇబ్బందికరంగా మారిందని.. ఈ రెండేళ్లలో రూ.10 కోట్లకు పైగా లాభం అందుకున్న ఒక్క నిర్మాతను అయినా చూపించండి అంటూ ఆమె సవాలు విసిరారు. తాము ఐటీ శాఖకు సమర్పించే పుస్తకాలన్నీ తీసుకొస్తానని.. మిగతా నిర్మాతలవీ చూడాలని.. ఎవ్వరైనా పది కోట్లకు మించి లాభం సంపాదించారేమో చూడాలని ఆమె అన్నారు. డబ్బులు తీసుకెళ్లి మరే రంగంలో పెట్టుబడిగా పెట్టినా గ్యారెంటీ ఉంటుందని.. భూమి మీద పెడితే మంచి రిటర్న్స్ వస్తాయని.. కానీ సినీ రంగంలో మాత్రం పెట్టిన డబ్బులకు గ్యారెంటీ లేదని ఆమె అన్నారు.

అయినా సరే సినిమా మీద ఇష్టంతోనే ఇండస్ట్రీలో కొనసాగుతున్నామన్నారు. హీరో, డైరెక్టర్ సహా ప్రతి ఒక్కరికీ రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే అని.. కానీ పని చేసినందుకు నిర్మాత మాత్రం ఏమీ సంపాదించడం లేదని.. నష్టాలే మిగులుతున్నాయని ఆమె ఆవేదన చెందారు. హాస్య మూవీస్ అధినేత రాజేష్ దండ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఓటీటీలు, డిస్ట్రిబ్యూటర్లు సహా ఎక్కడి నుంచి సమయానికి తమకు డబ్బులు రావట్లేదని.. కానీ తాము మాత్రం ప్రతి ఒక్కరికీ పక్కాగా పేమెంట్లు చేయాల్సిందే అని.. లేదంటే సినిమా పూర్తి కాదని అన్నారు. ఒక్కసారిగా సినీ కార్మికులు 30 శాతం వేతనాలు పెంచాలంటే అది మోయలేని భారం అవుతుందని ఆయనన్నారు.