పూజా హెగ్డే.. రీఎంట్రీ మూవీ ఇదేనా?

కొన్నేళ్ల పాటు తెలుగులో తిరుగులేని హవా సాగించింది బాలీవుడ్ భామ పూజా హెగ్డే. తెలుగులో తన తొలి మూడు చిత్రాలు ముకుంద, ఒక లైలా కోసం, దువ్వాడ జగన్నాథం ఆశించిన ఫలితాలు అందించకపోయినా.. ఆమె కెరీర్‌కు ఢోకా లేకపోయింది. ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో సూపర్ సెక్సీగా కనిపించి కుర్రాళ్ల గుండెలకు గాయాలు చేసిన పూజాకు అవకాశాలు వరుస కట్టాయి. మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి టాప్ స్టార్లతో సినిమాలు చేసిందామె. కానీ ఒక దశలో వరుస ఫ్లాపులు రావడంతో పూజా కెరీర్ డౌన్ అయిపోయింది.

కొన్నేళ్ల నుంచి తెలుగులో సినిమానే చేయలేదు పూజా. ఆ సమయంలో హిందీ, తమిళంలో మాత్రం బాగానే అవకాశాలు దక్కించుకుంది. తెలుగు రీఎంట్రీ గురించి వార్తలు వస్తున్నాయి కానీ.. అవేవీ నిజం కాలేదు. ఐతే ఈ మధ్య ‘రెట్రో’ ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన పూజా.. తన రీఎంట్రీ తెలుగు మూవీ దాదాపు ఓకే అయినట్లు చెప్పింది. ఆ కబురు కోసమే తన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

ఎట్టకేలకు పూజా చేయబోయే తర్వాత తెలుగు సినిమా గురించి సమాచారం బయటికి వచ్చింది. ఆమె నితిన్ సరసన నటించబోతున్నట్లు తెలుస్తోంది. వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న నితిన్.. త్వరలోనే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమాను మొదలుపెట్టబోతున్నాడు. వీరి కలయికలో వచ్చిన ‘ఇష్క్’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. మళ్లీ సుదీర్ఘ విరామం తర్వాత వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారు.

ఇదొక స్పోర్ట్స్ డ్రామా అని.. ఇందులో నితిన్ హార్స్ రైడర్‌గా కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి పూజాను కథానాయికగా ఖరారు చేసినట్లు సమాచారం. నితిన్ సొంత బేనర్ శ్రేష్ఠ్ మూవీస్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. త్వరలోనే పూర్తి వివరాలు బయటికి రానున్నాయి. పూజా ఒకప్పటి రేంజ్‌తో పోలిస్తే నితిన్ సరసన నటించడం కొంచెం తక్కువే అనిపించినా.. ఆమెకు అసలు అవకాశాలే లేని స్థితిలో ఈ మాత్రం ఛాన్స్ రావడం గొప్పే.