వరస డిజాస్టర్లతో ఉక్కిరిబిక్కిరవుతున్న నితిన్ కు తమ్ముడు ఫలితం ఊహించనంత దారుణంగా రావడం అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. భీష్మ తర్వాత అంత పెద్ద హిట్టు మళ్ళీ చూడలేకపోవడంతో ఫ్లాపుల ప్రభావం మార్కెట్ మీద తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో నితిన్ చేతిలో రెండు కీలకమైన సినిమాలున్నాయి. వాటిలో ఒకటి బలగం ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వంలో దిల్ రాజు ప్లాన్ చేసుకున్న ఎల్లమ్మ కాగా, విక్రమ్ కె కుమార్ డైరెక్షన్లో స్వారీ అనే వర్కింగ్ టైటిల్ తో ప్రీ ప్రొడక్షన్ దాదాపు పూర్తి చేసుకున్న ప్రాజెక్ట్ మరొకటి. వాస్తవానికి వీటిలో ఎల్లమ్మ ముందు మొదలవ్వాలి.
ఒకవేళ తమ్ముడు కనక బ్లాక్ బస్టర్ అయ్యుంటే వెంటనే ఎల్లమ్మ తెరకెక్కేది. కానీ ఇప్పుడీ భారీ చిత్రం బడ్జెట్ ని దిల్ రాజు పునః సమీక్ష చేస్తున్నారట. వీలైనంత ఖర్చు తగ్గించుకునే అవకాశాలు చూడమని వేణుకి చెప్పడంతో ఆ దిశగా కసరత్తు జరుగుతోందని అంటున్నారు. ఇంకోవైపు స్వారీకి గ్రౌండ్ రెడీ అవుతోందట. హార్స్ రేస్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ సినిమాకి యువి క్రియేషన్స్ పెద్ద బడ్జెట్ పెడుతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా దాదాపు లాకైనట్టు వినికిడి. ఎల్లమ్మకు కీర్తి సురేష్ ని ఓకే చేశారని టాక్ ఉంది కానీ ఇంకా డేట్లు తీసుకోలేదని సమాచారం. ఫైనల్ కాల్ ఇంకా తీసుకోవాల్సి ఉంది.
విశేషం ఏంటంటే ట్రాక్ రికార్డు ఎలా ఉన్నా నితిన్ సినిమాల బడ్జెట్ లు మరీ తీవ్రంగా తగ్గడం లేదు. కథ డిమాండ్ కు తగ్గట్టు పెట్టేందుకు ప్రొడ్యూసర్లు సిద్ధంగానే ఉన్నారు. కాకపోతే ఫలితాల వల్ల సమీకరణాల్లో మార్పులు వస్తున్నాయి. ముందు ఏది స్టార్ట్ అవ్వాలన్నా దానికి కొంచెం టైం పట్టేలా ఉంది. కథల ఎంపికలో చేస్తున్న పొరపాట్ల వల్ల నితిన్ పెద్ద మూల్యమే చెల్లించాల్సి వస్తోంది. అందుకే ఇకపై జాగ్రత్తగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నాడట. బలగం తర్వాత ఎల్లమ్మ మీదే సంవత్సరాలు గడిపేస్తున్న వేణు యెల్దండి, పరాజయాల్లో ఉన్న విక్రమ్ కుమార్ ఇద్దరికీ నితిన్ కు హిట్టివ్వాల్సిన బాధ్యత ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates