జాతీయ అవార్డుల తీరుపై నటి అసహనం

జాతీయ అవార్డులు ప్రకటించినపుడల్లా.. కొన్ని పురస్కారాల విషయంలో విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తం కావడం మామూలే. ఐతే ఈసారి విమర్శలు కాస్త ఎక్కువగానే వచ్చాయి. ముఖ్యంగా ఉత్తమ నటుడి పురస్కారాన్ని ‘జవాన్’ సినిమాలో నటనకు గాను షారుఖ్ ఖాన్‌కు కట్టబెట్టడం మీద సర్వత్రా వ్యతిరేకత వచ్చింది. షారుఖ్ గొప్ప నటుడే అయినా.. తన కెరీర్లో అద్భుతంగా పెర్ఫామ్ చేసిన వేరే సినిమాలకు వదిలేసి.. ‘జవాన్’ లాంటి మామూలు చిత్రానికి అవార్డు ఇవ్వడమే చాలామందికి రుచించలేదు.

పైగా పోటీలో ఉన్న నటుల పెర్ఫామెన్స్‌తో పోలిస్తే.. ‘జవాన్’లో షారుఖ్ నటన సాధారణం అనే చెప్పాలి. ఎక్కువమంది జాతీయ అవార్డు వస్తుందని అంచనా వేసింది ‘ది గోట్ లైఫ్: ఆడుజీవితం’లో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన నజీబ్ పాత్రకే. అందులో జీవనోపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి అక్కడ గొర్రెల కాపరిగా మారిన వ్యక్తిగా పృథ్వీరాజ్ అత్యద్భుతంగా నటించాడు. కానీ ఈ పాత్రకు అవార్డు రాలేదు.
పృథ్వీరాజ్‌కు అవార్డు రాకపోవడం మీద సీనియర్ నటి ఊర్వశి ఓపెన్‌గా జ్యూరీ తీరును ఎండగట్టేశారు. తెలుగు వారికి కూడా బాగా పరిచయం ఉన్న ఈ లెజెండరీ యాక్టర్.. తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ‘ఉల్లొలుకు’ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటిగా ఎంపికైంది.

అయినా సరే.. ఆమె పృథ్వీరాజ్ విషయంలో జరిగిన అన్యాయంపై గళం విప్పింది. నజీబ్ పాత్ర సామాన్యమైంది కానీ.. దాని కోసం పృథ్వీరాజ్ ప్రాణం పెట్టి పని చేశాడని.. ఒళ్లు హూనం చేసుకుని నటించాడని.. ఆ పాత్ర వెనుక నాలుగైదేళ్ల కష్టం దాగి ఉందని ఆమె పేర్కొంది. ‘ఎంపురన్’ సినిమా తీయడం వల్లే పృథ్వీరాజ్‌కు అవార్డు రాలేదన్నది ఓపెన్ సీక్రెట్ అని ఆమె కుండబద్దలు కొట్టింది.

పృథ్వీరాజ్‌కు జరిగిన అన్యాయానికి నిరసనగా తాను జాతీయ అవార్డు తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నట్లు ఊర్వశి స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం. పృథ్వీరాజ్‌కు అవార్డు ఇవ్వకపోడంపై మాలీవుడ్‌లో చాలామందిలో అసంతృప్తి ఉన్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేక సైలెంట్‌గా ఉన్నారు. తనకు అవార్డు వచ్చినా సరే.. ఇంత ఓపెన్‌గా జ్యూరీని తప్పుబట్టడం ఊర్వశికే చెల్లింది.