ఊహించని ఓపెనింగ్స్ తో కింగ్డమ్ భారీగా విడుదలైపోయింది. టీమ్ ఆనందంతో మొదటి షో పడిన కొన్ని గంటల్లోనే ప్రెస్ మీట్ పెట్టేసి సంతోషాన్ని పంచుకుంది. నిర్మాత నాగవంశీ, హీరో విజయ్ దేవరకొండ, సత్యదేవ్, వెంకిటిష్ ఇందులో పాల్గొన్నారు. తెలంగాణలో ఎక్కువగా ఆదరణ ఉండే విజయ్ దేవరకొండ ఈసారి సీడెడ్ లో అదరగొట్టాడని, ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం 50 శాతం రికవరీ మొదటి రోజే అయిపోతుందని, ఓవర్సీస్ లోనూ ఇదే మేజిక్ జరుగుతోందని చెప్పుకొచ్చారు. గురువారం రిలీజ్ గురించి టెన్షన్ పడ్డానని చెప్పిన విజయ్ ప్రొడ్యూసర్ భరోసా నిజమైనందుకు మాటలు రావడం లేదని తన భావాలు పంచుకున్నాడు.
ఈ సందర్భంగా కింగ్డమ్ 2 ప్రస్తావన వచ్చింది. త్వరలోనే సీక్వెల్ ఉంటుందని, విజయ్ దేవరకొండ కమిట్ మెంట్స్ పూర్తయ్యాక ప్లాన్ చేస్తామని అన్నారు. క్లైమాక్స్ లో చూపించిన సేతు పాత్రని ఒక స్టార్ హీరో చేస్తారని, అది చూశాక సర్ప్రైజ్ అవుతారని నాగవంశీ ఊరించారు. ఎక్కువ ప్రాధాన్యం దక్కని హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకు పార్ట్ 2లో ఇంపార్టెన్స్ ఉంటుందని వివరణ ఇచ్చారు. మొత్తానికి ఫ్యాన్స్ కి కొనసాగింపు గురించి క్లారిటీ అయితే వచ్చింది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో పీరియాడిక్ డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రత్యేకంగా పెంచిన మీసకట్టు దాని కోసమే.
రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందే ఈ ప్యాన్ ఇండియా మూవీ కాగానే లేదా సమాంతరంగా దిల్ రాజు నిర్మించే రౌడీ జనార్దన్ మొదలవుతుంది. దీనికి రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకుడు. ఎంతలేదన్నా వీటికి ఏడాదిన్నరకు పైగానే గడిచిపోతుంది. అప్పుడు కింగ్డమ్ 2 స్టార్ట్ చేయాలి. అసలు ముందు కింగ్డమ్ ఫైనల్ స్టేటస్ తెలియాలి. ఇదింకా మొదటి రోజే కాబట్టి కంప్లీట్ రన్ అయ్యాక కమర్షియల్ స్టామినా గురించి క్లారిటీ వస్తుంది. అప్పటిదాకా వెయిట్ చేయాలి. లైగర్, ఫ్యామిలీ స్టార్ గాయాల నుంచి కింగ్డమ్ ఏ మేరకు ఊరట కలిగించిందో ఇంకో వారం రోజుల్లో తేలిపోతుంది. చూద్దాం.
Gulte Telugu Telugu Political and Movie News Updates