పాపం సర్దార్ కష్టాలు చూస్తే జాలేస్తుంది

బాలీవుడ్ లో ఇప్పుడు మినిమమ్ గ్యారెంటీ హిట్స్ ఉన్న హీరో అజయ్ దేవగన్. బడ్జెట్, జానర్ ఎంతైనా, ఏదైనా పెట్టుబడిని సేఫ్ గా ఇవ్వగలుగుతున్నాడు. అలాంటి స్టార్ హీరో కొత్త సినిమాకు కష్టాలు రావడమంటే విచిత్రమేగా. ఆగస్ట్ 1 అంటే ఇంకో రెండు రోజుల్లో సన్నాఫ్ సర్దార్ 2 విడుదల కాబోతోంది. మొదటి భాగం మన సునీల్ మర్యాదరామన్నకు రీమేక్. ఇప్పుడీ సీక్వెల్ పూర్తిగా కొత్త కథతో రాసుకున్నారు. సర్దార్ విదేశాలకు వెళ్తే ఏమవుతుందని పాయింట్ మీద రూపొందించారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ట్రైలర్ మీద ఆశించిన స్పందన రాకపోగా ట్రోలింగ్ కు గురయ్యింది.

ఇదిలా ఉండగా సన్నాఫ్ సర్దార్ 2కి దేశవ్యాప్తంగా థియేటర్ల కొరత ఎదురయ్యిందట. ఎందుకంటే అయిదు వందల కోట్ల వైపు పరుగులు పెడుతున్న సైయారా బాక్సాఫీస్ వద్ద ఇంకా స్ట్రాంగ్ గా ఉండటంతో ఎగ్జిబిటర్లు మూడో వారంలోనూ దాన్ని కొనసాగించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంకోవైపు యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహ అనూహ్యంగా పికప్ అయిపోయి భాషతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లో రికార్డు వసూళ్లు రాబడుతోంది. దీన్ని తీసేయడానికి డిస్ట్రిబ్యూటర్లు ఇష్టపడటం లేదు. దక్షిణాదిలో విజయ్ దేవరకొండ కింగ్డమ్ వల్ల మల్టీప్లెక్సుల్లోనూ అవసరమైన స్క్రీన్లు దొరకడం లేదు.

ఇవన్నీ ఒక ఎత్తైతే సన్నాఫ్ సర్దార్ 2కి బజ్ లేకపోవడం గమనించిన నిర్మాతలు మొదటి రోజే టికెట్ల మీద 50 శాతం డిస్కౌంట్ ప్రకటించారు. కాకపోతే రెండు కొంటేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే వన్ ప్లస్ వన్ అన్నమాట. ఇంకో ట్విస్ట్ ఏంటంటే సన్నాఫ్ సర్దార్ 2 తో పాటుగా త్రిప్తి డిమ్రి ధఢక్ 2ని పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. మూలిగే నక్క మీద తాటిపండు పడటం అంటే ఇదే. దెబ్బకు అజయ్ దేవగన్ బొమ్మకు ఇండియా వైడ్ కేవలం వెయ్యి స్క్రీన్లే దొరికాయని ముంబై టాక్. అదిరిపోయిందనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే తప్ప సన్నాఫ్ సర్దార్ 2 గట్టెక్కడం కష్టమని విశ్లేషకుల మాట.