రాజమౌళి టార్గెట్ పుట్టినరోజు కాదు

ఇంకో పది రోజుల్లో ఆగస్ట్ 9 మహేష్ బాబు పుట్టినరోజు రానుంది. అభిమానులు సహజంగానే ఎస్ఎస్ఎంబి 29 అప్డేట్ గురించి ఎదురు చూస్తారు. కానీ ఈసారి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ ఉండదని రెండు రోజుల క్రితమే క్లారిటీ వచ్చేయడంతో అతడు రీ రిలీజ్ తోనే సర్దుకోక తప్పదు. దానికి అనుగుణంగానే ఫ్యాన్స్ ఓ రేంజ్ లో దానికి పబ్లిసిటీ ఇస్తున్నారు. చూస్తుంటే స్ట్రెయిట్ సినిమా రేంజ్ లో హడావుడి జరగడం ఖాయమే. ఖలేజా రికార్డులను టార్గెట్ గా పెట్టుకున్న వైనం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఇదిలా ఉంచితే అసలు రాజమౌళి మహేష్ బర్త్ డేని ఎందుకు సీరియస్ గా తీసుకోలేదనే పాయింట్ కొద్దాం.

నిజానికి జక్కన్న మనసులో ఇప్పట్లో ఎలాంటి అప్డేట్ ఇచ్చే ఉద్దేశంలో లేదట. ఎలాగూ 2027 రిలీజ్ కాబట్టి కావాలంటే వచ్చే సంవత్సరం మహేష్ పుట్టినరోజుకి టీజర్ వదలొచ్చనే ప్లానింగ్ లో ఉన్నారట. ఇప్పటిదాకా కనీసం పూజా కార్యక్రమాల వీడియో కూడా బయటికి రాలేదు. ఎందుకయ్యా అంటే ఎస్ఎస్ఎంబి 29 కోసం పలు అంతర్జాతీయ సంస్థలు కొలాబరేషన్ కోసం ప్రయత్నిస్తున్నాయి. వాటితో డీల్స్ చేసుకుని హాలీవుడ్ కంపెనీ టైఅప్ ద్వారా ఆస్కార్ మార్గాలు మరింత సుగమం చేసుకోవాలనేది రాజమౌళి మాస్టర్ ప్లాన్. అది ఖరారు అయ్యే దాకా అఫీషియల్ గా టీమ్ నుంచి ప్రెస్ మీట్లు వగైరాలు ఉండవు.

అందుకే దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీదే ఈ ప్యాన్ ఇండియా మూవీ రూపొందుతున్నా ఇప్పటిదాకా ఒక పోస్టర్ కానీ ప్రొడక్షన్ హౌస్ తరఫున ఒక ట్విట్టర్ హ్యాండిల్ కానీ మొదలుపెట్టలేదు. పార్ట్ నర్స్ అందరూ లాకయ్యాక అప్పుడు ఒక గ్రాండ్ ఈవెంట్ ద్వారా మొత్తం వివరాలు వెల్లడిస్తారు. అప్పటిదాకా ఫ్యాన్స్ కి లాంగ్ వెయిటింగ్ తప్పదు. ఆఫ్రికా షెడ్యూల్, రామోజీ ఫిలిం సిటీలో వేసిన కాశి సెట్ ఎపిసోడ్ రాబోయే రోజుల్లో అతి కీలకమైన ఘట్టాలు. వీటికో ఏడెనిమిది నెలలు పట్టొచ్చు. లీకుల రూపంలో తప్ప ఎలాంటి ఇన్ఫో లేకపోవడమే ట్విస్టు. ఇటీవలే కీరవాణి మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టారని తెలిసింది.