కొన్ని కథలు ఎంత ఆలస్యమైనా తెరకెక్కేందుకు ఉవ్విళ్ళూరతాయి. అలాంటిదే ఇది. కొన్నేళ్ల క్రితం రౌడీ ఫెలో, చల్ మోహనరంగా ఫేమ్ కృష్ణ చైతన్య ‘పవర్ పేట’ పేరుతో ఒక సబ్జెక్టు రాసుకున్నారు. నితిన్ హీరోగా తెరకెక్కించాలని ప్లాన్. ప్రాజెక్టు దాదాపు ఓకే అయిపోయింది. అనౌన్స్ మెంట్ ఒకటే బాకీ అనుకుంటున్న టైంలో హఠాత్తుగా ఆగిపోయింది. బడ్జెట్ కారణాలు, నితిన్ కు వరస ఫ్లాపులు రావడం లాంటి కారణాలు దాన్ని ముందుకు వెళ్లనివ్వలేదు. ఈలోగా గ్యాంగ్స్ అఫ్ గోదావరకి విశ్వక్ సేన్ కన్విన్స్ కావడంతో సితార బ్యానర్ మీద కృష్ణ చైతన్య వేరే స్టోరీని తీశాడు. దాని ఫలితం ఏమయ్యిందో చెప్పనక్కర్లేదు.
ఇప్పుడీ పవర్ పేట చేతులు మారింది. యాత్ర, ఆనందో బ్రహ్మ లాంటి సినిమాలు తీసిన 70 ఎంఎం ఎంటర్ టైన్మెంట్స్ ఇదే స్క్రిప్ట్ ని సందీప్ కిషన్ తో తెరకెక్కించబోతోంది. ఇంతకు ముందు రాసుకున్న ప్రకారం పవర్ పేట మొత్తం మూడు భాగాలుగా రావాలి. కానీ ఇప్పుడు సింగల్ పార్ట్ గా రేసీ స్క్రీన్ ప్లేతో తీస్తారని సమాచారం. గుంటూరు నగర నేపథ్యంలో ఒక గ్యాంగ్ స్టర్ బాల్యం నుంచి వయసు మళ్లే దాకా ఎలాంటి పరిణామాలు చవి చూశాడనే కాన్సెప్ట్ తో ఉంటుందట. వినగానే కమల్ హాసన్ నాయకుడు ఛాయలు కనిపించినా ఇది పూర్తిగా వేరే ట్రీట్ మెంట్ తో నిజ జీవిత సంఘటనలకు దగ్గరగా ఉంటుందట.
హీరో దర్శకుడు ఇద్దరికీ పవర్ పేట సక్సెస్ కావడం చాలా కీలకం. ఒక డీసెంట్ హిట్ వస్తే చాలు మూడు ఫ్లాపులు పలకరించడం సందీప్ కిషన్ కు ఇబ్బందిగా మారింది. మజాకా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే అదేమో తీవ్రంగా నిరాశపరిచింది. అందుకే కొంచెం స్పీడ్ తగ్గించి నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. ఇక కృష్ణ చైతన్య కూడా హిట్టు కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న బ్యాచే. రౌడీ ఫెలో పేరు తెచ్చింది కానీ ఆ తర్వాత చేసినవి ఫలితం ఇవ్వలేదు. అందుకే తన డ్రీం ప్రాజెక్టుగా పవర్ పేటని బెస్ట్ చూపిస్తానని అంటున్నాడు. మరి నితిన్ వదులుకున్న పవర్ సందీప్ కు ఎలా కలిసొస్తుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates