మౌనం వీడిన క్రిష్: వీర మల్లు కోసం ఎమోషనల్ పోస్ట్

దర్శకుడు జ్యోతికృష్ణ కష్టపడి ఉండొచ్చు. చాలా పెద్ద బాధ్యతను పూర్తి చేసి ఉండొచ్చు. కానీ హరిహర వీరమల్లుకి అంకురార్పణ చేసి దాంతో రెండు మూడు సంవత్సరాలు ప్రయాణం చేసిన వాడిగా క్రిష్ ని పూర్తిగా పక్కన పెట్టేయలేం. నిన్న జరిగిన ప్రెస్ మీట్, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా క్రిష్ ప్రస్తావన తీసుకొచ్చి మరీ పొగిడారు. ఆయన మస్తిష్కం నుంచి పుట్టిన ఆలోచన ఇవాళ ఇంత గొప్ప సినిమాని ఇచ్చిందనే రీతిలో ప్రశంసలు కురిపించారు. అయితే క్రిష్ వచ్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. కానీ ఇంటర్వ్యూల దగ్గర నుంచి ఈవెంట్ల దాకా ఎక్కడా కనిపించలేదు.

అనుష్క ఘాటీ పోస్ట్ ప్రొడక్షన్ లో క్రిష్ బిజీగా ఉన్నప్పటికీ ఒక రెండు మూడు గంటలు కేటాయించలేనంత అయితే ఖచ్చితంగా కాదు. ఒకవేళ పవన్ కనక వ్యక్తిగతంగా పిలిచి ఉంటే వచ్చేవారేమోననే అనుమానాలు అభిమానుల్లో లేకపోలేదు. నిజానికి క్రిష్ ఈ ప్రాజెక్టుని హ్యాండిల్ చేసి ఉంటే ఇవాళ హైప్ ఇంకోలా ఉండేదేమో. ఎందుకంటే జ్యోతికృష్ణ ఎంత సమర్థుడైనా అతని క్రెడిబిలిటీ ఏంటనేది ఋజువు చేసే బ్లాక్ బస్టర్ తన ఖాతాలో లేదు. గత ఏడాది రూల్స్ రంజన్ ఆశించిన ఫలితం అందుకోలేదు. దానికి తోడు ఇంత పెద్ద కాన్వాస్ జ్యోతికృష్ణ ఇప్పటిదాకా తన కెరీర్ లో హ్యాండిల్ చేయలేదు.

కానీ క్రిష్ కు గౌతమిపుత్ర శాతకర్ణి, మణికర్ణికలో కొంత భాగం తీసిన పీరియాడిక్ అనుభవముంది. సరే ఎవరు ఎవరినీ తక్కువంచనా వేయడానికి లేదు. ఏమో గుర్రం ఎగరావచ్చు సామెత తరహాలో జ్యోతికృష్ణ ఏదైనా అద్భుతం చేసి ఉండొచ్చు. తాజాగా క్రిష్ తన సోషల్ మీడియా అకౌంట్ లో హరిహర వీరమల్లు బృందానికి శుభాకాంక్షలు చెబుతూ సుదీర్ఘ మెసేజ్ పోస్ట్ చేశారు. అందులో పేరు పేరునా పేర్కొన్న క్రిష్ తన నుంచి బాధ్యత తీసుకున్న జ్యోతికృష్ణని ప్రస్తావించకపోవడం గమనార్హం. సరే ఏదైతేనేం సినిమా హిట్ కావాలి. రికార్డులు తిరగరాయాలి. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నది దాని కోసమే.