సాయితేజ్ సంబరాలు ఎప్పుడు చేస్తారు

సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సంబరాల ఏటిగట్టు షూటింగ్ అయితే జరుగుతోంది కానీ బయటికి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా టీమ్ సైలెంట్ గా ఉంది. గతంలో ప్రకటించిన దాని ప్రకారం సెప్టెంబర్ 25 రిలీజవ్వాలి. కానీ అదే రోజు పవన్ కళ్యాణ్ ఓజి ఫిక్స్ కావడంతో మేనమామను ఎదురుగా పెట్టుకుని పోటీ చేసే సాహసం అల్లుడు కల్లో కూడా ఊహించుకోడు. ఒకవేళ అఖండ 2 మాత్రమే ఉంటే రిస్క్ చేద్దామనుకున్నారు కానీ ఇప్పుడా ఛాన్స్ లేకుండా పోయింది. నెక్స్ట్ఉన్న ఆప్షన్ అక్టోబర్. కానీ ఇప్పటికైతే డేట్ గురించి నిర్ణయం తీసుకోలేదని ఇన్ సైడ్ టాక్.

ఇక్కడో సమస్య ఉంది. ప్రతి నెల కీలకమైన శుక్రవారాలు ఏదో ఒక ప్యాన్ ఇండియా మూవీతో బ్లాక్ అయిపోయాయి. అక్టోబర్ మొదటి వారంలోనే కాంతార చాప్టర్ 1, ఇడ్లీ కడాయ్ వస్తున్నాయి. మూడో వారంలో సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా, కిరణ్ అబ్బవరం కె ర్యాంప్ బిజినెస్ వ్యవహారాలు పూర్తి చేసుకునే పనిలో ఉన్నాయి. దర్శకుడు వశిష్ఠ ఇస్తున్న క్లూలను చూస్తుంటే విశ్వంభర కూడా అదే నెలలో రానుంది. ఇది నిజమైతే సాయితేజ్ కు మరో సంకటం ఎదురవుతుంది. అప్పుడు నవంబర్ తప్ప వేరే ఆప్షన్ ఉండదు. కానీ అది డ్రై మంత్. వంద కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమాలు ఆ సీజన్ లో వర్కౌట్ చేసుకోవడం కష్టం.

నెక్స్ట్ ఉన్నది డిసెంబర్. స్టోరీ అయిపోలేదు. ప్రభాస్ ది రాజా సాబ్ తో పాటు రణ్వీర్ సింగ్ దురంధర్ అయిదో తేదీని పట్టేసుకున్నాయి. క్రిస్మస్ ని అడవి శేష్ డెకాయిట్ తీసేసుకుంది. ఒకవేళ ఏదైనా కారణం వల్ల అఖండ 2, ఓజి, విశ్వంభర వీటిలో ఏదైనా ఒకటి పైన చెప్పిన నెలల్లో రాకపోతే దానికి ఇయర్ ఎండింగ్ తప్ప మరో మార్గం ఉండదు. ఎందుకంటే సంక్రాంతి స్లాట్స్ ఆల్రెడీ చిరంజీవి, రవితేజ, నవీన్ పోలిశెట్టి, తమిళ హీరో విజయ్ తీసేసుకున్నారు. సో సంబరాల ఏటిగట్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. కెపి రోహిత్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ డ్రామాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది.