అభిమానులు ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు టికెట్ రేట్ల పెంపు వ్యవహారం ఆంధ్రప్రదేశ్ లో కొలిక్కి వచ్చేసింది. పది రోజుల పాటు మల్టీప్లెక్సుల్లో టికెట్ మీద 200 రూపాయలు, సింగల్ స్క్రీన్ అప్పర్ బాల్కనీ 150, లోయర్ క్లాస్ 100 రూపాయలు పెంచుకునే వెసులుబాటు కలిగిస్తూ ఏపీ ప్రభుత్వం జిఓ జారీ చేసింది. అంతేకాదు ముందు రోజు జూలై 23 రాత్రి స్పెషల్ ప్రీమియర్లకు కూడా అనుమతి ఇచ్చి, దీనికి ఫ్లాట్ 600 రూపాయల టికెట్ ధరని నిర్ణయించారు. ఇది అన్ని థియేటర్లకు ఒకటే ఉంటుంది. జూలై 24 నుంచి ఆగస్ట్ 2 దాకా ముందు చెప్పిన పెంపులు అమలులో ఉంటాయి.
అయిదేళ్ల సుదీర్ఘ నిర్మాణం, వందల కోట్ల బడ్జెట్, భారీ విఎఫ్ఎక్స్, పెద్ద తారాగణంతో నిర్మించిన ఈ విజువల్ గ్రాండియర్ ను మాములు రేట్లకు చూపించలేమని, పెట్టిన ఖర్చుకు తగ్గట్టు రిటర్న్స్ కోరుకుంటున్నామని, అంతే తప్ప లాభాల కోసం కాదని నిర్మాత ఏఎం రత్నం చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇంత భారీ హైక్ తీసుకున్న సినిమాలు లేవు. పుష్ప 2 తర్వాత అంతకన్నా ఎక్కువ పెంపు అందుకున్న హరిహర వీరమల్లు ఖచ్చితంగా ఎక్స్ ట్రాడినరి స్థాయిలో ఉంటేనే పెట్టిన టికెట్ డబ్బులకు ఆడియన్స్ న్యాయంగా ఫీలవుతారు. లేదంటే ఇదే మిస్ ఫైర్ అయ్యే రిస్క్ లేకపోలేదు.
ఏఎం రత్నం, జ్యోతికృష్ణ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నమ్మకం పెట్టుకోవచ్చనే స్థాయిలో ఉంది. అంతర్గత రిపోర్ట్స్ సానుకూలంగా ఉండటం ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని రేపుతోంది. గత నెల రోజులుగా బాక్సాఫీస్ డ్రైగా ఉంది. కుబేర హిట్ తర్వాత కన్నప్ప నుంచి జూనియర్ దాకా ఏ సినిమా పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో ఎఫ్1, జురాసిక్ వరల్డ్ రీ బర్త్, సూపర్ మ్యాన్ లాంటి హాలీవుడ్ మూవీస్ సొమ్ములు చేసుకున్నాయి. ఆఖరికి సైయారాకు సైతం మంచి నెంబర్లు కనిపించడానికి కారణం ఇదే. ఇప్పుడు హరిహర వీరమల్లు కనక సాలిడ్ హిట్టు కొడితే థియేటర్లు మళ్ళీ హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడుతాయి.

Gulte Telugu Telugu Political and Movie News Updates