కర్ణాటక షాక్ : టికెట్ ధర 200 రూపాయలే

పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రం సంచలన నిర్ణయం తీసుకుంది. మల్టీప్లెక్స్, సింగల్ స్క్రీన్ ఏదైనా సరే గరిష్ట టికెట్ ధర 200 రూపాయలు లోపే ఉండాలని జిఓ జారీ చేయడం ఎగ్జిబిషన్ వర్గాలకు పెద్ద షాకిచ్చింది. ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్న ఫ్లెక్సీ ప్రైసింగ్ ని వాడుకుని అక్కడున్న థియేటర్లు ముఖ్యంగా బెంగళూరు మల్టీప్లెక్సులు ఇష్టారాజ్యంగా టికెట్ ధరలు పెంచేసేవి. దీని వల్ల సామాన్యులు హాలీవుడ్ సినిమాలు త్వరగా చూసే పరిస్థితి లేకపోయింది. దిగువన ఉన్న బిసి సెంటర్స్ లో ఈ సమస్య లేకపోయినా హుబ్లీ, ధార్వాడ్, బెళగావి లాంటి నగరాల్లో బిగ్ స్క్రీన్ ఎంటర్ టైన్మెంట్ సామాన్యులకు భారంగా మారింది.

ఇప్పుడీ చర్య పట్ల మల్టీప్లెక్సుల సంఘం కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు శాండల్ వుడ్ టాక్. ఎందుకంటే బెంగళూరులో చాలా ప్రీమియర్ స్క్రీన్లు ఉన్నాయి. త్వరలో మహేష్ బాబు కూడా భారీ సముదాయాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేవలం 200 రూపాయలకే టికెట్లు అమ్మాలంటే వర్కవుట్ కావడం కష్టం. కానీ సగటు ప్రేక్షకులకు ఇది గుడ్ న్యూస్ అవుతుంది. కాకపోతే బ్లాక్ మార్కెట్ పెరిగే అవకాశాన్ని కొట్టి పారేయలేం. టికెట్లను బ్లాక్ చేసి యాజమాన్యాలు వాటిని బయట ఎక్కువ రేట్లకు అమ్ముకునే ఛాన్స్ లేకపోలేదు. వాటిని కట్టడి చేయడానికి పోలీస్ వ్యవస్థ రంగంలోకి దిగాలి.

చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలకు ఇబ్బంది లేదు కానీ ప్యాన్ ఇండియా సినిమాలకు ఈ పరిణామం చాలా ఇబ్బంది. ఎందుకంటే కన్నడ కంటే తమిళ, తెలుగు చిత్రాలు కర్ణాటకలో బాగా ఆడతాయి. నాటి చిరంజీవి కాలం నుంచి ఇప్పటి మహేష్ బాబు దాకా ప్రతిఒక్కరికి అక్కడ బలమైన మార్కెట్ ఉంది. పుష్ప 2 ది రూల్ రికార్డులు బద్దలు కొట్టింది. లియో సెన్సేషనల్ వసూళ్లు అందుకుంది. అవన్నీ అంత సులభంగా ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చు. ఇది కొంచెం ఎక్కువగానే మన బిజినెస్ మీద ప్రభావం చూపించేలా ఉంది. అక్కడేమో కానీ ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి మోడల్ వస్తే అంతే సంగతులు.