40 ఏళ్ళ కెరీర్లో నాగార్జున మొదటిసారి

కూలీలో నాగార్జున మెయిన్ విలన్ అనేది అందరికీ అర్థమైపోయింది. ప్రమోషన్ ఇంటర్వ్యూల ముందు వరకు ఏదో రోలెక్స్ తరహా క్యారెక్టర్ అనుకున్నారు కానీ తాజా సంగతులు వింటే మాత్రం ఇది అంతకు పదింతలు ఉంటుందనే క్లారిటీ వచ్చేసింది. తన 40 ఏళ్ళ కెరీర్ లో ఎప్పుడూ వాడని పదాలు, డైలాగులు ఈ సినిమాలో చెప్పానని, నా కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలని ఉందని నాగ్ చెప్పారని దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకోవడం ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్ గా మారింది. అంటే బూతులు ఉండకపోవచ్చు కానీ దందాలు, హత్యలకు సంబంధించిన లాంగ్వేజ్ స్ట్రాంగ్ గా ఉన్నట్టు ఉంది.

ఇదంతా లోకేష్ కనగరాజే చెప్పుకొచ్చాడు. అయితే ఈ కాంబో ఆషామాషీగా జరగలేదు. రజనీకాంత్ ని ఒకే సిట్టింగ్ లో అది కూడా ఫస్ట్ హాఫ్ మాత్రమే చెప్పి ఒప్పించిన లోకేష్ నాగార్జునకు మాత్రం ఏడెనిమిది నేరేషన్లు ఇస్తే తప్ప పనవ్వలేదు. అంత డెప్త్ ఏముందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. నాగార్జున నెగటివ్ షేడ్స్ చేయడం ఇది మొదటిసారి కాదు. రామ్ గోపాల్ వర్మ అంతంలో ట్రై చేశారు కానీ జనాలకు కనెక్ట్ కాలేదు. కిల్లర్ లో డబ్బుల కోసం హత్యలు చేసే వాడిగా నటించినా అది సాఫ్ట్ టోన్ లో ఉంటుంది. మళ్ళీ ఇలా చూపించే సాహసం ఎవరూ చేయలేదు. ఫైనల్ గా లోకేష్ కనగరాజ్ దొరికాడు.

కుబేరతో ఇటీవలే హిట్ అందుకున్న నాగార్జునకు కూలి కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ కానుంది. విలన్ గా తనను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలని వెయిట్ చేస్తున్నారు. ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న కూలి కనక హిట్ అయితే మరిన్ని ఇలాంటి క్యారెక్టర్లు నాగార్జునను పలకరించే ఛాన్స్ ఉంది. అయితే చేస్తారా చేయరా అనేది ఆయా దర్శకుల కథలను బట్టి ఉంటుంది. ఏదైతేనేం మొదటిసారి రజనీకాంత్ కాంబోలో నటిస్తున్న నాగార్జునకి కూలి స్పెషల్ మెమరీగా నిలవనుంది. అక్కినేని అభిమానులు తండేల్, కుబేర సక్సెస్ ఎంజాయ్ చేశాక ఇప్పడు కూలితో హ్యాట్రిక్ పూర్తి చేయాలని ఎదురు చూస్తున్నారు.