స్టంట్ మాస్టర్ మరణం… దర్శకుడి మీద పోలీస్ కేస్

రజనీకాంత్ తో వరసగా రెండు సినిమాలు కాలా, కబాలి చేసిన దర్శకుడిగా పా రంజిత్ కు తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అవి ఆశించిన ఫలితాలు అందుకోలేదు కానీ వీటికన్నాముందు కార్తీతో తీసిన మద్రాస్ తన బెస్ట్ వర్కని చెప్పొచ్చు. అయితే నేటివిటీ సమస్య వల్ల మన దగ్గర డబ్బింగ్ కు నోచుకోలేదు. గత ఏడాది తంగలాన్ రూపంలో విక్రమ్ కో ఫ్లాప్ ఇచ్చిన పా రంజిత్ ప్రస్తుతం ఆర్య (వరుడు విలన్) తో వెట్టవుమ\మ్ చేస్తున్నారు. ఒక యాక్షన్ ఎపిసోడ్ తీస్తున్న సమయంలో స్టంట్ మాస్టర్ ఎస్ఎం రాజు అలియాస్ మోహన్ రాజ్ చనిపోవడం కోలీవుడ్ లో సంచలనం రేపింది. ఇప్పుడా వీడియోనే సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ఎత్తయిన ర్యాంపు నుంచి కారుని దూకించే క్రమంలో పట్టు తప్పిపోవడంతో అది బోల్తా పడి రాజు అక్కడిక్కడే చనిపోయారు. నిర్మాణ సంస్థ, దర్శకుడి వైపు నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ బహిరంగ ప్రకటన చేసింది. పా రంజిత్ తో పాటు ప్రొడక్షన్ టీమ్ లో ఉన్న రాజ్ కమల్, వినోత్, ప్రభాకరన్ అనే మరో ముగ్గురి మీద తమిళనాడు కెలయూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదయ్యింది. తక్షణం కోటి రూపాయలు అతని కుటుంబానికి నష్ట పరిహారంగా చెల్లించాలని స్టంట్ మాస్టర్ల సంఘం డిమాండ్ చేస్తోంది.

ఇలా జరగడం మొదటిసారి కాదు. గతంలో కన్నడ సినిమా మాస్తి గుడి షూటింగ్ చేస్తుండగా హెలికాఫ్టర్ నుంచి జారిపడి ఇద్దరు ఫైట్ మాస్టర్లు చనిపోవడం కలకలం రేపింది. భారతీయుడు 2 సెట్లో క్రేన్ పడిపోయి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళను అంత సులభంగా మర్చిపోలేం. ఇప్పుడు వెట్టవుమ్ లో ఇది రిపీట్ అయ్యింది. స్టంట్లు చేసేవాళ్లు ఎంత అనుభవజ్ఞులైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీడియోలో గమనిస్తే రాజు బృందానికి సరైన రీతిలో రక్షణ ఏర్పాట్లు చేయలేనట్టుగా కనిపిస్తోంది కేసులు, పరిహారాలు సంగతి పక్కన పెడితే ఒక విలువైన ప్రాణం పోయింది. ఆ కుటుంబానికి తీరని నష్టం మిగిలింది.