మహారాజా దర్శకుడితో రజినీ?

లేటు వయసులో మంచి స్పీడుతో సినిమాలు చేసుకుపోతున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. గత ఏడాది అక్టోబరులో ‘వేట్టయాన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. వచ్చే నెలలో ‘కూలీ’తో పలకరించబోతున్నారు. ఆయన తర్వాతి చిత్రం ఇప్పటికే చిత్రీకరణ దశలోకి వెళ్లింది. అదే.. జైలర్-2. ఇది వచ్చే వేసవికి రిలీజయ్యే అవకాశముంది. ఇంతలోనే ఆయన తర్వాతి సినిమా గురించి కబురు వినిపిస్తోంది. ఈసారి ఆయన ఒక అప్‌కమింగ్ డైరెక్టర్‌తో జట్టు కట్టబోతున్నట్లు కోలీవుడ్ సమాచారం. ఆ దర్శకుడే.. నిథిలన్ స్వామినాథన్. 

గత ఏడాది బ్లాక్ బస్టర్ అయిన ‘మహారాజా’ సినిమాతో నిథిలన్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తమిళంలో ఈ మధ్య కాలంలో అతి పెద్ద సెన్సేషన్‌గా ఈ సినిమాను చెప్పాలి. విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాక కమర్షియల్‌గానూ గొప్ప విజయం సాధించింది. ఒక కొత్త తమిళ దర్శకుడు తన తొలి చిత్రంలో ఇంత ప్రతిభ చూపించడం ఈ మధ్య కాలంలో ఇదే అని చెప్పాలి. ‘మహారాజా’ చైనాలో రిలీజ్ చేస్తే అక్కడా మంచి వసూళ్లు సాధించడం విశేషం. ప్రస్తుతం నిథిలన్ ‘మహారాజా-2’ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. త్వరలోనే అది సెట్స్ మీదికి వెళ్లనుంది.

దీని తర్వాత నిథిలన్ సూపర్ స్టార్‌తో జట్టు కట్టబోతున్నాడట. నిథిలన్ చెప్పిన ఒక లైన్ నచ్చి సినిమా చేయడానికి రజినీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. రజినీ, నిథిలన్ తమ తర్వాతి చిత్రాలను పూర్తి చేశాక వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో కలిసి సినిమాను మొదలుపెట్టే అవకాశముంది. ఐతే రజినీకి మాస్, కమర్షియల్ దర్శకులే కరెక్ట్ అనే అభిప్రాయం ఉంది. ‘జై భీమ్’ లాంటి భిన్నమైన సినిమా తీసిన జ్ఞానవేల్.. రజినీతో చేసిన ‘వేట్టయాన్’తో నిరాశపరిచాడు. మరి నిథిలన్ అయినా రజినీతో కమర్షియల్ హిట్ కొడతాడేమో చూడాలి.