తెలుగు వారిని తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ లెజెండరీ నటుడు కోట శ్రీనివాసరావు ఈ రోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. వందల చిత్రాల్లో అద్భుతమైన పాత్రలతో ఆయన నాలుగు దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఈ క్రమంలో సినీ పరిశ్రమలో ఆయన ఎంతోమంది దిగ్గజాలతో కలిసి పని చేశారు. వారిలో ఆయనకు అత్యంత సన్నిహితులైన వ్యక్తులు కొందరున్నారు. వారిలో బ్రహ్మానందం ఒకరు. ఇప్పుడు ఇద్దరు నటులు కలిసి ఓ పది చిత్రాల్లో నటిస్తేనే దాని గురించి ప్రత్యేకంగా చెప్పకుంటున్నాం. అలాంటిది కోట, బ్రహ్మి కలిసి వందల చిత్రాల్లో నటించడం విశేషం. వీళ్లిద్దరూ సినిమాలో ఉన్నారంటే ప్రేక్షకుల కడుపులు చెక్కలవ్వాల్సిందే.
ఇద్దరూ కలిసి అనేక చిత్రాల్లో కామెడీని అద్భుతంగా పండించారు. వ్యక్తిగతంగా కూడా ఇద్దరూ అత్యంత సన్నిహితులు. బ్రహ్మానందాన్ని కోట ఎప్పుడూ అరేయ్, ఒరేయ్ అనే పిలిచేవారు. వయసులో కొంచెం పెద్ద అయినప్పటికీ.. కొన్నిసార్లు బ్రహ్మి కూడా ఆయన్ని అలాగే పిలిచేవారు. అంతటి సన్నిహితుడైన వ్యక్తి ఈ రోజు చనిపోయేసరికి బ్రహ్మానందం తట్టుకోలేకపోయారు. ఆయన పార్థివ దేహాన్ని చూసిన సందర్భంగా బ్రహ్మానందం బోరున విలపించారు. రాజేంద్ర ప్రసాద్తో కలిసి కోట చివరి చూపు కోసం వచ్చిన బ్రహ్మానందం.. ఆయన పార్థివ దేహం వద్ద కన్నీరు మున్నీరవుతున్న దృశ్యాలు అందరినీ కలచి వేశాయి.
అనంతరం మీడియాతో మాట్లాడుతున్నపుడు కూడా బ్రహ్మి ఏడుపు ఆపుకోలేకపోయారు. తామిద్దరం కలిసి వందల చిత్రాల్లో నటించామని.. ఒక దశలో తాను, కోట, బాబు మోహన్ ప్రతి సినిమాలో ఉండేవాళ్లమని.. రోజుకు 20 గంటలు కలిసి పని చేసేవాళ్లమని బ్రహ్మి గుర్తు చేసుకున్నారు. తామిద్దరం పరస్పరం అరేయ్ ఒరేయ్ అనుకునేవాళ్లమని.. అలాంటి కోట లేడు అంటే నమ్మలేకపోతున్నానని.. నటన ఉన్నంత వరకు కోట బతికే ఉంటారని బ్రహ్మి వ్యాఖ్యానించారు. కోట ఏ విషయాన్నయినా నిర్మొహమాటంగా మాట్లాడతారని.. నటుడిగా ఆయనది ఎవ్వరూ అందుకోలేని స్థాయి అని.. అలాంటి నటుడు చనిపోవడం దేశానికే పెద్ద లోటు అని బ్రహ్మానందం అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates