ఆర్జీవీకి ర‌జినీకాంత్ కౌంట‌ర్‌?

ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనే మాటకు సరైన ఉదాహరణగా నిలుస్తుంటాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడైన రజినీ.. తెర మీద ఎంత ఆడంబరంగా కనిపిస్తాడో, వ్యక్తిగత జీవితంలో అంత సింప్లిసిటీ చూపిస్తాడు. ఆయన విగ్గు వాడడు. జుట్టుకు రంగేయడు. బట్టతలతో 70 ఏళ్లు పైబడ్డ వ్యక్తి ఎలా కనిపిస్తాడో అలాగే దర్శనమిస్తాడు. అంతే కాక రజినీ మాటల్లోనూ ఎంతో సింప్లిసిటీ కనిపిస్తుంది. రవ్వంత కూడా అతి కనిపించదు. ఏవైనా సినిమా, ఇతర ఈవెంట్లకు హాజరైతే బిల్డప్‌లకు పూర్తిగా దూరంగా ఉ:టారు. తన మీద తనే సెటైర్లు వేసుకోవడానికి రజినీ వెనుకాడడు.

‘రోబో’ సినిమా రిలీజ్ టైంలో.. ఓ ఈవెంట్లో మాట్లాడుతూ ఈ సినిమాలో ఐశ్వర్యారాయ్ హీరోయిన్ అని తాను చెబితే, హీరో ఎవరు అని ఓ వ్యక్తి అడిగిన విషయం చెప్పి నవ్వులు పూయించడం రజినీకే చెల్లింది. తాజాగా దర్శకుడు శంకర్‌తో కలిసి ఓ ఈవెంట్లో పాల్గొన్న రజినీ.. అక్కడా తన మీద తనే సెటైర్లు వేసుకున్నాడు. ‘వేల్పరి’ అనే పుస్తకం గొప్ప విజయం సాధించిన నేపథ్యంలో ఆ రచయితకు అభినందన సభ ఏర్పాటు చేశారు చెన్నైలో. ఈ ఈవెంట్‌కు అతిథుల్లో ఒకరిగా హాజరైన రజినీ.. తన ప్రసంగం సందర్భంగా ఈ కార్యక్రమానికి తననెందుకు పిలిచారో అర్థం కాలేదని అన్నారు.

పుస్తక పఠనానికి సంబంధించిన కార్యక్రమం అంటే కమల్ హాసన్, శివకుమార్ లాంటి మేధావులను పిలవాలని.. అలా కాకుండా 75 ఏళ్ల వయసులో కూలింగ్ గ్లాసులు పెట్టుకుని స్లో మోషన్లో నడిచే తనను ఎందుకు పిలిచారో అర్థం కావడం లేదని రజినీ అనడంతో ఆ కార్యక్రమంలో నవ్వులు విరిసాయి. ఐతే ర‌జినీ చేసిన ఈ కామెంట్.. ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌కు కౌంట‌రా అనే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది.

ఈ మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో వ‌ర్మ మాట్లాడుతూ.. స్లోమోష‌న్ లేక‌పోతే ర‌జినీ హీరోగా కొన‌సాగ‌లేడ‌న్న‌ట్లు మాట్లాడాడు. ఈ కామెంట్ల మీదే ర‌జినీ వ్యంగ్యంగా స్పందించాడేమో అనిపిస్తోంది. ఇదిలా ఉండ‌గా.. ‘వేల్పరి’ పుస్తకాన్ని తాను 25 శాతం చదివానని.. తన రిటైర్మెంట్ తర్వాత మిగతాది పూర్తి చేస్తానని రజినీ ఈ సందర్భంగా చెప్పాడు. ‘వేల్పరి’ని వెండి తెరపైకి తీసుకెళ్లాలని దర్శకుడు శంకర్ భావిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కోసం తాను ఎదురు చూస్తున్నట్లు రజినీ తెలిపాడు.