కిల్ రీమేక్ రిస్క్ అవుతుందేమో

గత ఏడాది రిలీజైన బాలీవుడ్ మూవీ కిల్ ఎంత పెద్ద హిట్టో మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఒక రాత్రి ట్రైన్ లోపలికి దొంగలు చొరబడి సొమ్ముల కోసం ప్రయాణికులను హత్య చేయడానికి తెగబడితారు. వాళ్ళను ఎదిరించి అంతమొందించే ఆర్మీ ఆఫీసర్ కథగా దర్శకుడు నిఖిల్ నగేష్ భట్ చూపించిన ట్రీట్ మెంట్ ప్రేక్షకులతో శభాష్ అనిపించుకుంది. బడ్జెట్ తక్కువ కావడంతో నిర్మాత కరణ్ జోహార్ కు కనకవర్షం కురిసింది. ఇదంతా జరిగి సంవత్సరం అయిపోయింది. తెలుగు తమిళ భాషల్లో రీమేక్ అనే వార్తలు అప్పట్లోనే వచ్చాయి కానీ కార్యరూపం దాల్చలేదు. మళ్ళీ ఇప్పుడీ కిల్ హాట్ టాపికయ్యింది.

ఇండస్ట్రీ టాక్ ప్రకారం కిల్ రిమేక్ ని ఇక్కడ బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో, తమిళంలో ధృవ్ విక్రమ్ తో ఒకేసారి తీసే ప్లానింగ్ జరుగుతున్నట్టు సమాచారం. రాక్షసుడు, ఖిలాడీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తారట. ప్రస్తుతం ఆయన లారెన్స్ తో కాల భైరవ అనే ప్యాన్ ఇండియా మూవీ తీస్తున్నారు. ఇది కొంచెం ఆలస్యమయ్యేలా ఉండటంతో ఈ లోగా కిల్ ని పూర్తి చేయొచ్చని తెలిసింది. తనకు రాక్షసుడు రూపంలో మంచి హిట్ ఇచ్చిన దర్శకుడిగా రమేష్ వర్మ మీద బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కు నమ్మకముంది. ఇక ధృవ్ విక్రమ్ కు ఇలాంటి సబ్జెక్టులు బాగా సూట్ అవుతాయి.

ఇదంతా బాగానే ఉంది కానీ కిల్ ఆల్రెడీ హాట్ స్టార్ లో అన్ని ప్రధాన భాషల్లో డబ్బింగ్ వెర్షన్లతో సహా అందుబాటులో ఉంది. కోట్ల మంది చూసేశారు కూడా. ఇప్పుడు మళ్ళీ కిల్ ని తీయడంలో ఆంతర్యం ఏమిటో అంతు చిక్కడం లేదు. గతంలో ఇదే తరహా కాన్ఫిడెన్స్ తో లూసిఫర్ ని చిరంజీవి గాడ్ ఫాదర్ గా తెరకెక్కిస్తే ఫలితం దక్కలేదు. కిల్ కు కూడా ఆ రిస్క్ ఉంది. పైగా సాయి శ్రీనివాస్, ధృవ్ విక్రమ్ భారీ మార్కెట్ ఉన్న హీరోలు కాదు. కంటెంట్ బాగుంటేనే జనాన్ని తీసుకురాగలరు. టాక్ తేడా కొడితే ఇబ్బందే. మరి కిల్ రీమేక్ ప్రతిపాదన నిజంగా ముందుకెళ్ళబోతోందా లేక ప్రచారం దగ్గర ఆగుతుందా చూడాలి.