సైఫ్ 15 వేల కోట్ల ఆస్తులు.. పోయినట్లేనా?

ఇండియన్ సినిమాల్లో రిచెస్ట్ హీరో ఎవరు అంటే.. సైఫ్ అలీఖాన్ పేరే చెప్పాలి. వారిది నవాబుల కుటుంబం. వారసత్వంగా వేల కోట్ల ఆస్తి సైఫ్ కుటుంబం సొంతం. మొత్తం ఆస్తుల లెక్క అంచనా వేయలేని స్థాయిలో ఉంటాయన్నది సైఫ్ సన్నిహితుల సమాచారం. ఐతే అందులో రూ.15 వేల కోట్ల ఆస్తిని సైఫ్ కోల్పోబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని తన పూర్వీకుల ఆస్తులను సొంతం చేసుకోవడానికి సైఫ్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.

అక్కడున్న రూ.15 వేల కోట్ల ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగా పేర్కొనాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సైఫ్ వేసిన పిటిషన్‌ను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. అది ఎనిమీ ప్రాపర్టీనే అని నిర్ణయిస్తూ ఆదేశాలిచ్చింది. అంతే కాక ఈ వ్యవహారంపై మరోసారి విచారణ జరిపి.. ఏడాది లోగా తుది నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. సైఫ్ దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లాలనుకుంటున్నాడు. ఈ ఆస్తుల వెనుక పెద్ద కథే ఉంది.

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ చివరి నవాబు హమీదుల్లా చిన్న కూతురు సాజిదా. ఆయన పెద్ద కూతురు అబీదా సుల్తాన్.. దేశ విభజన తర్వాత 1950లో పాకిస్థాన్‌కు వెళ్లిపోయింది. సాజిదా మాత్రం ఇక్కడే ఉండిపోయి నవాబు అయిన ఇఫ్తికార్ అలీ ఖాన్‌ను పెళ్లాడింది. వీరి తనయుడే మన్సూర్ అలీఖాన్ పటౌడీ. ఆయన కొడుకు సైఫ్ అలీఖాన్ అన్న సంగతి తెలిసిందే. ఐతే సాజిదాకు ఆమె తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులు తర్వాత సైఫ్ కుటుంబానికి దక్కాయి. 

ఐతే అబీదాకు చట్టబద్ధమైన వారసురాలు అబీదా మాత్రమేనని.. ఆమె పాకిస్థాన్‌కు వలస వెళ్లినందువల్ల ఎనిమీ యాక్ట్ ప్రకారం వీటిని కాందిశీకుల ఆస్తులుగా గుర్తిస్తున్నట్లు కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ కార్యాలయం 2015లో ప్రకటించింది. దీన్ని సవాలు చేస్తూ, ఆ ఆస్తులు తమకు దక్కేలా ఆదేశాలు ఇవ్వాలని సైఫ్ మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ ఇప్పుడు అతడికి చుక్కెదురైంది.