మోహన్ లాల్ కూతురు… 22 కిలోలు తగ్గి

సినీ కుటుంబాల నుంచి అబ్బాయిలు హీరోలుగా మారడం మామూలే కానీ.. అమ్మాయిలు హీరోయిన్లు అవడం అరుదు. ఇందుకు ఏ సినీ పరిశ్రమ కూడా మినహాయింపు కాదు. ఈ అరుదైన జాబితాలో చేరడానికి సిద్ధమవుతోంది విస్మయ మోహన్ లాల్. మలయాళంలో బిగ్గెస్ట్ స్టార్ అయిన మోహన్ లాల్ తనయురాలు.. లీడ్ రోల్‌లో సినిమా మొదలవుతోంది. లాలెట్టన్ సొంత నిర్మాణ సంస్థ అనదగ్గ ‘ఆశీర్వాద్ సినిమాస్’ బేనర్ మీద ఆయన మిత్రుడు ఆంటోనీ పెరువంబూర్ నిర్మించబోయే ఈ చిత్రం పేరు.. తుడక్కుమ్.
తన కూతురి తెరంగేట్రం గురించి మోహన్ లాల్ స్వయంగా ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

‘‘డియర్ మాయా కుట్టీ.. ‘తుడక్కుమ్’తో నువ్వు వేస్తోంది తొలి అడుగే కావచ్చు. కానీ అది జీవితంతో సినిమాతో సాగే బంధం’’ అని ఆయన పేర్కొన్నారు. రెండేళ్ల కిందట విడుదలై ఆ సమయానికి మలయాళ సినిమాల కలెక్షన్ల రికార్డులన్నీ బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘2018’ చిత్రాన్ని రూపొందించిన జూడ్ ఆంటోనీ జోసెఫ్.. మోహన్ లాల్ కూతురిని కథానాయికగా పరిచయం చేయబోతుండడం విశేషం. మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ ఇప్పటికే నటుడిగా రాణిస్తున్నాడు. తండ్రిలా తరచుగా సినిమాలు చేయట్లేదు కానీ.. నటుడిగా మంచి గుర్తింపే సాధించాడు.

‘హృదయం’ అతడి కెరీర్లో పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు లాలెట్టన్ కూతురు కూడా హీరోయిన్ అయిపోతోంది. విశేషం ఏంటంటే.. తన తొలి చిత్రం కోసం విస్మయ ఏకంగా 22 కిలోల బరువు తగ్గింది. తండ్రి లాగే చిన్నప్పటి నుంచి కొంచెం బొద్దుగా ఉన్న విస్మయ.. యుక్త వయసులో బాగా బరువు పెరిగింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే విస్మయ‌కు బాడీ షేమింగ్ కామెంట్లు కూడా తప్పలేదు. కానీ తెరంగేట్రం చేయాలని నిర్ణయించుకున్నాక బరువు తగ్గి నాజూగ్గా తయారైంది విస్మయ. ‘2018’ లాంటి బలమైన కంటెంట్ ఉన్న, బ్లాక్ బస్టర్ సినిమా తీసిన దర్శకుడితో జట్టు కడుతుండడంతో విస్మయ తొలి సినిమాతోనే మంచి విజయాన్నందుకోవడం ఖాయమని మోహన్ లాల్ అభిమానులు ధీమాగా ఉన్నారు.