నాగచైతన్య మిస్ చేసుకున్న బంగారాలు

అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని అని ఆత్రేయ గారు రాసింది అక్షరాలా నిజం. సినీ పరిశ్రమలో ఇది చాలా సార్లు ఋజువయ్యింది. నాగచైతన్య విషయంలో ఇది మరీ ఎక్కువనిపిస్తోంది. దర్శకుడు వెంకీ అట్లూరి ఇటీవలే ఇచ్చిన ఒక పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో తన అయిదు సినిమాల కథలు ముందు చైతుకే వినిపించానని, కానీ డేట్లు ఇతరత్రా కారణాల వల్ల తమ కాంబో మిస్సయ్యిందని చెప్పుకొచ్చాడు. వరుణ్ తేజ్ కు తొలిప్రేమ ఎంత మంచి హిట్టుగా నిలిచిందో చూశాం. అఖిల్ మిస్టర్ మజ్ను మిస్ ఫైర్ అయ్యింది కాబట్టి దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

నితిన్ రంగ్ దే సైతం ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. ధనుష్ సార్ ఊహించని స్థాయిలో ఘన విజయం అందుకుంది. స్కూల్ బ్యాక్ డ్రాప్ తీసుకుని వెంకీ అట్లూరి నడిపించిన విలేజ్ డ్రామా క్లాసు మాసుని మెప్పించింది. ఇక దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ అంతకు మించిన బ్లాక్ బస్టర్. ఏకంగా వంద కోట్ల క్లబ్బులో చేరింది. నెట్ ఫ్లిక్స్ లో నెలల తరబడి టాప్ ట్రెండింగ్ లో ఉండిపోయింది. ఇప్పుడు సూర్య తో ఛాన్స్ రావడానికి కారణం కూడా ఈ ట్రాక్ రికార్డే. చైతు మిస్ చేసుకున్న బంగారాలు టోటల్ గా మూడు. తొలిప్రేమ, సార్, లక్కీ భాస్కర్. వీటిలో ఏ రెండు  చేసినా ఫ్యాన్స్ మరింత పండగ చేసుకునేవాళ్ళు.

ఇదంతా వెంకీ అట్లూరి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అక్కినేని ఫ్యామిలీ మీద తనకున్న అభిమానం అలాంటిది. భవిష్యత్తులో ఎప్పటికైనా నాగార్జున, చైతులకు డైరెక్ట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. సరైన కథ సెట్ అయితే అదేమీ పెద్ద కష్టం కాదు కానీ అఖిల్ కు ఫ్లాప్ ఇచ్చిన లోటైతే వెంకీలో ఉంది. ప్రస్తుతం సూర్యతో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేస్తున్న ఈ టైమ్లీ దర్శకుడు బయోపిక్స్, పీరియాడిక్స్ జోలికి వెళ్లకుండా సూర్యని చక్కగా ఆవిష్కరించే ప్రయత్నంలో ఉన్నాడు. సితార బ్యానర్ మీద భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ అయ్యాక వెంకీ చేయబోయే తర్వాత లిస్టులో అయినా చైతు ఉంటాడేమో చూడాలి.