కన్నప్ప సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న మంచు విష్ణు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నాడు. చాలా విషయాల్లో ఓపెనయ్యాడు. మొహమాట పడకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు. ఇంత పెద్ద కాన్వాస్ పెట్టుకుని టాలీవుడ్ లో ఎందరో లెజెండరీ డైరెక్టర్లు ఉండగా ముఖేష్ కుమార్ సింగ్ నే ఎందుకు నమ్మారనే ప్రశ్న ఈ సందర్భంగా ఎదురయ్యింది. దానికి సమాధానం చెబుతూ తన గత రెండు మూడు సినిమాలు ఎలా అడాయో అందరికీ తెలుసని, ఒకవేళ కన్నప్ప స్క్రిప్ట్ పట్టుకుని ఎవరినీ కలిసినా తనతో తీసేవాళ్ళు కాదని స్టేజి మీద స్పష్టంగా కుండబద్దలు కొట్టేశాడు.
విష్ణు చెప్పింది నిజమే. తానున్న ఫామ్ లో స్టార్ దర్శకులు ఎవరూ కన్నప్ప హ్యాండిల్ చేసే సాహసానికి సిద్ధపడే వాళ్ళు కాదేమో. అందుకే మహాభారతం లాంటి ఎపిక్ సీరియల్ తీసిన ముఖేష్ కు ఆ బాధ్యతలు ఇచ్చారు. ఇవాళ అవుట్ ఫుట్ కళ్ళముందు కనిపిస్తోంది. ఇదొక్కటే కాదు ఇంత పెద్ద ఓపెనింగ్ రావటానికి ప్రధాన కారణం ప్రభాసేనని, ఇది ఒప్పుకోవడంలో తనకు ఎలాంటి ఈగోలు లేవని చెప్పిన విష్ణు ఇక్కడ మరో మెట్టు ఎక్కేశాడు. మంచు మనోజ్ ప్రీమియర్ చూసి పాజిటివ్ గా స్పందించిన విషయాన్ని ఒకరు గుర్తు చేయగా అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నాడు.
ఇలా బోలెడు కబుర్లు పంచుకున్న మంచు విష్ణు కన్నప్ప ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో తన డ్రీం ప్రాజెక్టులను ప్లాన్ చేసుకుంటానని చెబుతున్నాడు. నెంబర్ల గురించి తనకు ఆరాటం లేదని, నెక్స్ట్ చేయబోయే కమర్షియల్ సినిమా నుంచి వాటిని బయట పెడతానని చెప్పడం గమనార్హం. మొదటి రోజు సుమారుగా పదహారు కోట్లకు పైగా గ్రాస్ వచ్చిందని ట్రేడ్ టాక్. విష్ణు కెరీర్ లో ఇదే హయ్యెస్ట్ నెంబర్. ప్రభాస్ క్యామియో దీనికి దోహదపడిందనేది అందరూ ఒప్పుకునే వాస్తవం. ఆ ఇరవై నిముషాలు మినహాయించి మిగిలిన సినిమా మొత్తం మోసింది విష్ణు అనే వాస్తవాన్ని విస్మరించకూడదు. సండే రన్ కన్నప్పకు కీలకం కానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates