బాలీవుడ్, పంజాబ్ పరిశ్రమల్లో మంచి గుర్తింపు ఉన్న దిల్జిత్ దొసాంజె ఇప్పుడు నిషేధం ప్రమాదంలో పడ్డాడు. ఇతని కొత్త సినిమా సర్దార్ జీ 3లో పాకిస్థాన్ నటి ఉన్న కారణంగా మన దేశంలో బ్యాన్ కు గురయ్యింది. ఇతర దేశాల్లో నిన్న జూన్ 27 రిలీజైపోయింది. అయితే దిల్జిత్ దొసాంజె ఈ పరిణామాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు శత్రుదేశంలో సర్దార్ జీ 3 విడుదల చేయడంతో జనాలు భగ్గుమన్నారు. ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్, ఫెడరేషన్ అఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయిస్ సంయుక్తంగా ఇతని మీద శాశ్వత నిషేధం డిమాండ్ చేయడంతో ఒక్కసారిగా వ్యవహారం వేడెక్కింది.
ఇతను సన్నీ డియోల్ బోర్డర్ 2లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలే సదరు ప్రొడక్షన్ కంపెనీకు, హీరోకు, దిల్జిత్ దొసాంజెని సినిమా నుంచి తప్పించమని మెయిల్స్ వెళ్లాయి. వాటికి ఇంకా స్పందన రాలేదు. తాజా సంఘటనల దృష్ట్యా ఇది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పంతానికి పోవడం వల్ల దిల్జిత్ దొసాంజె తన కెరీర్ ని సమాధి చేసుకుంటున్నాడని అభిమానులు వాపోతున్నారు. సర్దార్ జీ 3ని అంత అర్జెంట్ గా పాకిస్థాన్ లో రిలీజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని, కేవలం రెచ్చగొట్టేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడటం ఫ్యాన్స్ గా సమర్ధించమని సోషల్ మీడియా వేదికగా వాపోతున్నారు.
దిల్జిత్ దొసాంజె గతంలో ప్రభాస్ కల్కి ప్రొమోషనల్ వీడియోలో నటించిన సంగతి తెలిసిందే. నటన, గాత్రం రెండూ ఉన్న అరుదైన క్యాటగిరీలో ఇతనొస్తాడు. కానీ అనాలోచిత చర్యల వల్ల బ్యాన్ దాకా సాగదీయడం సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టయ్యింది. ఒకవేళ ఇప్పుడు కనక నిషేధం అమలులోకి వస్తే మాత్రం నిర్మాణంలో ఉన్న సినిమాలు, ఆడియో ఆల్బమ్స్ అన్నీ రిస్క్ లో పడతాయి. ఇక్కడ వెలుగు చూసే ఛాన్స్ ఉండదు. ఇప్పటికైతే దిల్జిత్ దొసాంజె రిపేర్ చేసుకోలేని డ్యామేజ్ కు పాల్పడ్డాడు. అయినా పాకిస్థాన్ మీద అంత ప్రేమేంటని నెటిజెన్లు గట్టిగానే తలంటుతున్నా ఇప్పటిదాకా ఈ ఇష్యూ గురించి అతను నేరుగా స్పందించలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates