తమిళ కుబేరుడు ఎందుకు తడబడ్డాడు

టాలీవుడ్ థియేటర్లకు ఊపిరినిచ్చిన కుబేర వీక్ డేస్ లో కొంత నెమ్మదించినప్పటికీ కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. ఏపీలో పలు చోట్ల పెంచిన టికెట్ రేట్లు అలాగే అమలు చేస్తుండటంతో వసూళ్ల మీద ప్రభావం ఉందని స్పష్టమవుతోంది. నైజామ్ లో స్ట్రాంగ్ గా ఉన్న కుబేర ఇవాళో రేపో వంద కోట్ల క్లబ్బులో అడుగుపెట్టొచ్చని ఒక అంచనా. ఇక్కడ ఈ స్థాయిలో కుబేర ఆడుతుంటే తమిళనాడులో మాత్రం ఇంత స్పందన లేకపోవడం బయ్యర్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ధనుష్ కున్న ట్రాక్ రికార్డు దృష్ట్యా ఇప్పుడు వచ్చిన టాక్ ఈజీగా రికార్డులు కొట్టాలి. కానీ అంత దూకుడు కనిపించడం లేదు. టూరిస్ట్ ఫ్యామిలీని కూడా టచ్ చేసేలా లేదు.

కోలీవుడ్ కుబేరుడు ఎందుకు తడబడ్డాడనే దాని మీద రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది శేఖర్ కమ్ముల డైరెక్షన్ స్టైల్ అరవ ఆడియన్స్ కి సుపరిచితం కాకపోవడమే. ధనుష్ ఎక్స్ ట్రాడినరి పెర్ఫార్మన్స్ ఇచ్చినప్పటికే కమర్షియల్ గా స్ట్రైక్ అయ్యే అంశాలు లేకపోవడం అక్కడి మాస్ కి నచ్చలేదు. అందులోనూ ధనుష్ క్యారెక్టరైజేషన్ లో హీరోయిజం ఉండదు. నిస్సహాయతే చివరిదాకా డామినేట్ చేస్తుంది. పరిస్థితులు తనకు అనుకూలంగా మారిపోయి పనులు జరుగుతాయి తప్ప దేవా పాత్ర అసాధారణమైన తెలివి తేటలు చూపించే సందర్భాలు ప్రీ క్లైమాక్స్ ముందు నుంచి మాత్రమే వస్తాయి.

ధనుష్ తో సమానంగా నాగార్జున పాత్ర ట్రావెల్ చేయడం కనెక్టివిటీ తగ్గించడానికి మరో కారణంగా చెప్పొచ్చు. రాయన్, వడ చెన్నై, అసురన్, కర్ణన్ అంత బాగా రిసీవ్ చేసుకోవడానికి రీజన్ ఒకటే. ఎంత సీరియస్ గా కథ చెప్పినా మాస్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా ఆయా దర్శకులు వాటిని హ్యాండిల్ చేసిన విధానం. శేఖర్ కమ్ములకు ఈ విద్య రాదు. నిజాయితిగా కథ చెప్పేందుకు ప్రయత్నించాడు. సహజంగానే తమిళ జనాలకు అంతగా ఎక్కలేదు. పోటీ లేకపోయినా కోలీవుడ్ కుబేర వీక్ గా ఉండటం విచిత్రం. అక్కడి డిస్ట్రిబ్యూటర్లు మాత్రం క్రమంగా పెరుగుతున్న పాజిటివ్ టాక్ మంచి ఫలితమే ఇస్తుందని ఎదురు చూస్తున్నారు.