గౌరవం కోసం కొన్ని… డబ్బుల కోసం కొన్ని: దిల్ రాజు

ఆ మధ్య దిల్ రాజు బ్యానర్ లో మార్కో దర్శకుడు అనీఫ్ అదేని ఒక సినిమా చేయబోతున్నట్టు వచ్చిన వార్త ఇండస్ట్రీ వర్గాలనే కాదు ప్రేక్షకులను సైతం ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే మార్కోలో ఓవర్ వయొలెన్స్ వసూళ్లయితే తెచ్చింది కానీ అంతకన్నా ఎక్కువ విమర్శలను మోసుకొచ్చింది. సున్నితత్వాన్ని పూర్తిగా పక్కనపెట్టి దారుణమైన రీతిలో హత్యలు, హింసను చూపించిన తీరు మీద ఫ్యామిలీ ఆడియన్స్ భగ్గుమన్నారు. ఉత్తరాది కొన్ని థియేటర్లలో ఆడియన్స్ ఏకంగా షోలు ఆపించిన ఉదంతాలున్నాయి. ఈ నెగటివిటీ చూడలేక మార్కో 2 చేయడం లేదని హీరో ఉన్ని ముకుందన్ ఇటీవలే ప్రకటించాడు.

మరి ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న డైరెక్టర్ తో దిల్ రాజు చేతులు కలపడం అనూహ్యమే. తమ్ముడు ప్రమోషన్లలో భాగంగా మా ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బొమ్మరిల్లు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటివి గౌరవం తీసుకొస్తాయని, వాటితో పాటు కలెక్షన్లు వస్తాయని, అయితే మార్కో లాంటివి ఎక్కువ సొమ్ములు చేయడం గమనించాలని అన్నారు. అంటే ఒక నిర్మాతగా కొన్నిసార్లు గౌరవం కొన్నిసార్లు డబ్బు కోసం చూసుకున్నప్పుడే రెండూ బ్యాలన్స్ అవుతాయని చెప్పారు. హీరో ఎవరనేది వెల్లడించలేదు కానీ 2026లో ప్రారంభమై ఆపై సంవత్సరం విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట.

దిల్ రాజు చెప్పిన దాంట్లో లాజిక్ అయితే ఉంది. కాకపోతే ఫ్యామిలీ బ్యానర్ గా గుర్తింపు ఉన్న ఎస్విసిలో ఇప్పటిదాకా పూర్తి వయొలెంట్ కంటెంట్ ఉన్న సినిమా రాలేదు. రామ్ చరణ్, ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్లతో చేసినా సరే పరిమిత మీటర్ లోనే ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అనీఫ్ అదేనితో ప్లాన్ చేసుకున్నది దిల్ రాజు బ్యానర్ మీద కాదు. ఆయన కూతురు నిర్మాతగా వ్యవహరించబోయే దిల్ రాజు ప్రొడక్షన్స్ సంస్థలో తీస్తున్నారు. బలగం, లవ్ మీ దీంట్లోనే రూపొందాయి. రాబోయే రెండేళ్లలో భారీ ప్యాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేసుకున్న దిల్ రాజు  మళ్ళీ స్పీడ్ పెంచబోతున్నారు.