సమంత సిరీస్ సమస్యల్లో ఇరుక్కుందా ?

ఇటీవలే నిర్మాతగా మారి శుభం తీసిన సమంత ఫైనాన్షియల్ గా లాభపడింది కానీ థియేట్రికల్ గా ఆ సినిమా యావరేజ్ గానే నిలిచింది. ప్రస్తుతం తనే టైటిల్ రోల్ పోషిస్తున్న మా ఇంటి బంగారంని ఈ ఏడాది విడుదల చేసే ప్లాన్ లో ఉంది. దీనికి సంబంధించిన ఎలాంటి వివరాలు బయటికి రాకుండా జాగ్రత్త పడుతోంది. సామ్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టుల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనది రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్. ది ఫ్యామిలీ మ్యాన్ సృష్టికర్తలు రాజ్ అండ్ డికె ఆధ్వర్యంలో రూపొందుతున్న ఈ సైంటిఫిక్ హారర్ డ్రామాలో వామికా గబ్బి, ఆదిత్య రాయ్ కపూర్, ఆలీ ఫజల్ లాంటి క్రేజీ క్యాస్టింగ్ ఉంది. ఇప్పుడిది ఆగేలా ఉందని బాలీవుడ్ టాక్.

వివరాల్లోకి వెళ్తే రక్త్ బ్రహ్మాండ్  ని నెట్ ఫ్లిక్స్ సంస్థ సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేసుకుంది. ఓ నెల రోజుల షూటింగ్ కూడా జరిగింది. కానీ సంస్థకు చెందిన ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేసిన స్కామ్ వల్ల చాలా నష్టం జరిగిపోయింది. దీంతో కొంత కాలం చిత్రీకరణ ఆపేసి ఆడిటింగ్ మొదలుపెట్టారు. స్క్రిప్ట్ కూడా సరిగా రాలేదని, పలు మార్పులు చేర్పులు చేయడంతో అప్పటిదాకా షూట్ చేసిందంతా వృథాగా మారిపోయే రిస్క్ వచ్చిందట. తుంబడ్ లాంటి క్లాసిక్ ని డైరెక్ట్ చేసిన రాహి అనిల్ బర్వె సైతం నిస్సహాయంగా మిగిలిపోయినట్టు ఇండస్ట్రీ టాక్. దీంతో మొత్తం అయోమయం నెలకొందట.

ఇప్పటిదాకా ఖర్చయ్యింది పక్కనపెడితే ఇకపై పెట్టబోయే పెట్టుబడి వల్ల లాభం లేదని గుర్తించిన నెట్ ఫ్లిక్స్ ఇప్పుడీ రక్త్ బ్రహ్మాండ్  ని క్యాన్సిల్ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. సన్నిహితులు అడిగితే రాజ్ అండ్ డికె అలాంటిదేమి లేదని, జాప్యం జరిగినా త్వరలోనే రీ స్టార్ట్ అవుతుందని అంటున్నారు. దీనికి కమిటైన ఇతర ఆర్టిస్టులు వేరే షూటింగ్స్ కు వెళ్లిపోయారు. రాజ్ అండ్ డికె మాత్రం త్వరలో ఒక భారీ యాక్షన్ షెడ్యూల్ తో  పునఃప్రారంభిస్తామని, వర్షాల వల్ల లేట్ అవుతోందని అంటున్నారట. హారర్ బ్యాక్ డ్రాప్ తో క్రేజీ కంటెంట్ తో రూపొందే రక్త్ బ్రహ్మాండ్  ఆగిపోకూడదనే సగటు మూవీ లవర్స్ కోరిక.