థియేటర్ కన్నా నెట్ ఫ్లిక్స్ లో బాగుంటుందా

ఒకపక్క థియేటర్, ఓటిటికి మధ్య గ్యాప్ తగ్గిపోవడం వల్ల జనాలు సినిమా హాళ్లకు రావడం లేదని బయ్యర్లు మొత్తుకుంటూనే ఉన్నారు. పెద్దతెరపై చూసే అనుభూతికి ఏదీ సాటిరాకపోయినా కరోనా టైం నుంచి మారిపోయిన అలవాట్ల వల్ల ప్రేక్షకుల మైండ్ సెట్ కొత్తగా ఆలోచిస్తోంది. ఈ క్రమంలో ఆడియన్స్ ని మెప్పించడం పెద్ద సవాల్ గా మారిపోయింది. స్మార్ట్ స్క్రీన్లలో చూడొద్దని ముందు బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ పొందండని హీరోలు దర్శక నిర్మాతలు క్రమం తప్పకుండా చెబుతూనే ఉంటారు. కానీ దానికి భిన్నంగా 8 వసంతాలు సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి స్టేట్ మెంట్ ఇవ్వడం ఆశ్చర్యపరుస్తోంది.

థియేటర్ కంటే త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చాక 8 వసంతాలు ఇంకా బాగా నచ్చుతుందని, ఇమేజ్ ప్రాసెసింగ్ లాంటివి మెరుగ్గా ఉంటాయని చెప్పడం చూసి సక్సెస్ మీట్ కొచ్చిన మీడియా షాక్ తింది. నేరుగా ఓటిటిలోనే చూడమని అర్థం వచ్చేలా చెప్పడం నిజంగా ఊహించనిది. ముందు థియేటర్ లో చూడండి, ఆ తర్వాత డిజిటల్ లో ఇంకా ఎంజాయ్ చేస్తారని చెప్పడం వేరు. కానీ ఇలా స్పష్టంగా డిఫరెన్స్ వివరిస్తే వెళ్లాలనుకున్న ఆ కొద్దిమంది ఆగిపోతారుగా. బహుశా విశ్వనాథ్ రెడ్డి ఏదైనా సింగల్ స్క్రీన్ లో చూసిన అనుభవంతో అలా మాట్లాడారేమో కానీ అర్థం అయితే నెగటివ్ గా వచ్చేసింది.

అసలే ఇది సోషల్ మీడియా కాలం. పైగా 8 వసంతాలు ఎంత పొయెటిక్ గా ఉన్నా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకోలేదు. చాలా చోట్ల ఆదివారం సైతం షోలు క్యాన్సిలయ్యాయని రిపోర్ట్స్ ఉన్నాయి. అలాంటప్పుడు చేసుకునే ప్రమోషన్ మరింత బలంగా ఉండాలి. అంతే తప్ప థియేటర్ కన్నా నెట్ ఫ్లిక్స్ లో బెటర్ గా ఉంటుందని చెప్పడం కాదు. అర్హత పదంతో వైరల్ అయిన దర్శకుడు నరేంద్ర ఫనిశెట్టితో పాటు నిర్మాతలు ఎవరూ సక్సెస్ ప్రెస్ మీట్ కి హాజరు కాకపోవడం విచిత్రం. గంట కన్నా ఎక్కువ పట్టని ప్రోగ్రాంకు గైర్హాజరు కావడం కొత్త అనుమానాలు రేపుతోంది. వచ్చిన టీమ్ మాత్రం తమది సూపర్ బ్లాక్ బస్టరని చెప్పేసుకున్నారు.