టాలీవుడ్ వెయిటింగ్.. శేఖర్ కమ్ముల కొడతాడా?

ఒకప్పుడు సమ్మర్ సీజన్ అంటే ప్రేక్షకులతో థియేటర్లు కళకళలాడిపోయేవి. పెద్ద పెద్ద సినిమాలు రిలీజవుతూ.. ప్రతి వారం సందడి నెలకొనేది. కానీ గత కొన్నేళ్ల నుంచి వేసవి వెలవెలబోతోంది. ఈసారి కూడా పరిస్థితి మరీ దారుణం. ఒక్క పెద్ద సినిమా కూడా లేదు. రిలీజైన వాటిలో కూడా థియేటర్లలో సందడి తీసుకొచ్చినవి తక్కువ. సమ్మర్ వేస్టయినా.. జూన్ నెలలో వారం వారం క్రేజీ సినిమాలు వస్తున్నాయని ప్రేక్షకులు సంబరపడ్డారు. కానీ తొలి వారంలో వచ్చిన ‘థగ్ లైఫ్’ డిజాస్టర్ అయింది. రెండో వారానికి షెడ్యూల్ అయిన పవన్ కళ్యాణ్ సినిమా ‘హరిహర వీరమల్లు’ వాయిదా పడిపోయింది. దీంతో ఇక మూడో వారానికి షెడ్యూల్ అయిన పెద్ద సినిమా ‘కుబేర’ మీదే అందరి దృష్టీ నిలిచింది.

వెండితెరలో వెలుగులు నింపుతుందని ఈ సినిమా మీద ఇండస్ట్రీ చాలా ఆశలే పెట్టుకుంది. ఈ సినిమా హిట్ కావడం చిత్ర బృందానికే కాదు.. టాలీవుడ్‌కు కూడా ఎంతో అవసరం.
ఇప్పటిదాకా ఎక్కువగా లవ్ స్టోరీలే డీల్ చేసిన విలక్షణ దర్శకుడు శేఖర్ కమ్ముల.. రూటు మార్చి ‘కుబేర’ను సీరియస్ సోషల్ డ్రామాగా మలిచాడు. ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక.. ఈ కాంబినేషనే చాలా క్యూరియాసిటీని నింపుతోంది. కమ్ముల సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందించడం కూడా ఊహించనిదే. నిర్మాతలు కూడా కథ మీద, కాంబినేషన్ మీద నమ్మకంతో ఏకంగా రూ.150 కోట్ల బడ్జెట్ పెట్టేశారు.

సినిమా గురించి ధనుష్, నాగ్ ఒక రేంజిలో చెబుతున్నారు. తన సినిమాల గురించి ఎక్కువగా గొప్పలు చెప్పుకోని కమ్ముల సైతం దీని గురించి మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నాడు. టీజర్, ట్రైలర్ చూస్తే కథేంటన్నది అంతగా అర్థం కాలేదు. హీరోను బిచ్చగాడిగా చూపిస్తూ మెప్పించడం అంటే మాటలు కాదు. మరి ఈ ఛాలెంజ్‌ను శేఖర్ ఎలా అధిగమించడాన్నది ఆసక్తికరం. ఇటు తెలుగులో, అటు తమిళంలో ఈ సినిమాకు పెద్ద టార్గెట్లే ఉన్నాయి. వాటిని అందుకోవాలంటే టాక్ అదిరిపోవాలి. మరి శేఖర్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాడా.. టాలీవుడ్ కోరుకుంటున్న బ్లాక్ ‌బస్టర్‌ను అందిస్తాడా?