ఎదురు చూసే కొద్దీ ఆలస్యమవుతూ వచ్చిన కుబేర ఆంధ్రప్రదేశ్ అడ్వాన్స్ బుకింగ్స్ కు సంబంధించి రూట్ క్లియరయ్యింది. మల్టీప్లెక్స్, సింగల్ స్క్రీన్ భేదం లేకుండా ప్రతి టికెట్ మీద 75 రూపాయలు పది రోజుల వరకు పెంచుకునే వెసులుబాటు ఇస్తూ ప్రభుత్వం జిఓ జారీ చేసింది. అంటే నైజాం సింగల్ స్క్రీన్ ధర కన్నా ఇప్పుడు ఆంధ్రాలో రేట్ ఎక్కువగా ఉండబోతోంది. ఉదాహరణలో హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో 175 ఉంటే విజయవాడ లాంటి నగరాల్లో ఇప్పుడది సులభంగా 180 నుంచి 200 దాకా చేరనుంది. ఇక మల్టీప్లెక్స్ సంగతి సరేసరి. ఇప్పుడు ఉన్న 177 రూపాయలకు ఇంకో 75 అదనంగా తోడవుతుంది.
సో లేట్ అయినా సరే ఎట్టకేలకు కుబేర అమ్మకాలు మొదలుకాబోతున్నాయి. అయితే ఈ పరిణామం ప్రేక్షకులకు ఎంత మేరకు సానుకూలంగా కనిపిస్తుందో వేచి చూడాలి. ఎందుకంటే బడ్జెట్ సంగతి పక్కనపెడితే కుబేరకు డీసెంట్ హైప్ ఉంది తప్ప ఆర్ఆర్ఆర్, కల్కి రేంజ్ లో లేదు. కానీ ఇప్పుడీ పెంపు ప్రభావం ఓపెనింగ్స్ మీద పడే అవకాశం లేకపోలేదు. ఏరియాని బట్టి టికెట్ రేట్లు పెడతామని చెప్పిన నిర్మాత సునీల్ నారంగ్ అన్నట్టుగానే దాన్ని భాగ్యనగరంలో అమలుపరిచారు. కానీ ఇప్పుడు ఏపిలో ఏం చేస్తారనేది కీలకం. మ్యాడ్ స్క్వేర్, రాబిన్ హుడ్ లాగా కొన్ని ప్రాంతాలకు పరిమితం చేస్తారేమో చూడాలి.
అసలే నెల రోజుల నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ బాగా డ్రైగా ఉంది. కుబేర మీదే అందరి ఆశలు ఉన్నాయి. ఒకవేళ టికెట్ రేట్లు సాధారణంగా ఉంటే ఇంకాస్త వేగంగా బుకింగ్స్ జరిగేవేమో కానీ ఇప్పుడు ఆడియన్స్ లో కొన్ని వర్గాలు ఖచ్చితంగా టాక్ కోసం ఎదురు చూస్తాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేరలో ధనుష్, నాగార్జున కాంబినేషన్ అంచనాలు పెంచుతోంది. ట్రైలర్ చూశాక మూవీ లవర్స్ కు కంటెంట్ మీద నమ్మకం వచ్చేసింది. క్లాస్ తో పాటు మాస్ ని ఆకట్టుకోగలిగితే జాక్ పాట్ కొట్టినట్టే. అది ఎంత వరకు నెరవేరబోతోందో రేపీ సమయానికల్లా తేలిపోతుంది. చూడాలి కుబేర ఏం చేయబోతున్నాడో.
Gulte Telugu Telugu Political and Movie News Updates