ధనుష్ – నాగార్జున మొదటిసారి కలయికతో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన కుబేర జూన్ 20 విడుదలకు రెడీ అవుతోంది. హైదరాబాద్ లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకధీర రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేయగా రష్మిక మందన్న, దేవిశ్రీ ప్రసాద్ తో పాటు మొత్తం క్యాస్ట్ అండ్ క్రూ హాజరయ్యింది. ఈ సందర్భంగా బోలెడు కబుర్లు, ముచ్చట్లు దొర్లాయి. జక్కన్న మాట్లాడుతూ శేఖర్ కమ్ముల తన సిద్ధాంతాలు నమ్ముకుని సినిమాలు తీస్తాడని, కానీ నా చిత్రాలు మాత్రం నేను నమ్మేదానికి విరుద్ధంగా ఉంటాయంటూ కొత్త బాంబు పేల్చారు. కుబేర టైటిల్, టీమ్ ని చూశాక తన ఆసక్తి పెరిగిందని చెప్పుకొచ్చారు.
యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ధనుష్ తనకు పవన్ కళ్యాణ్ ని దర్శకత్వం వహించాలని ఉందని చెప్పడం ఒక్కసారిగా స్టేడియం మొత్తం చప్పట్లు, ఈలలతో మారుమ్రోగేలా చేసింది. ఒకవేళ నిజమైతే ఎంత బాగుండోనని అక్కడ అనుకోని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఎంత డబ్బున్నా దానికి రెట్టింపు సమస్యలు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉంటాయని కుబేర ఫిలాసఫీని అంతర్లీనంగా ధనుష్ చెప్పడం ఆకట్టుకుంది. శేఖర్ కమ్ముల తాను థాంక్స్ చెప్పాల్సిన వాళ్ళ పేర్లు పుస్తకంలో రాసుకొచ్చి మరీ చదవడం వెరైటీగా అనిపించడంతో పాటు నవ్వులు పూయించింది. సరస్వతిదేవి తలెత్తి చూసేలా కుబేర ఉంటుందని చెప్పడం విశేషం.
దేవిశ్రీ ప్రసాద్ ఎలివేషన్లు ఓ రేంజ్ లో పండాయి. ఇంత గొప్ప కథ మనం ఇంతకు ముందు చూసి ఉండమని, స్క్రిప్ట్, విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు. రష్మిక మందన్న సినిమా విశేషాలతో పాటు జీవితం ఎంత సున్నితమయ్యిందో ఇటీవలి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదంలో వందల మంది చనిపోవడాన్ని ఉదాహరించింది. ధనుష్ మాట్లాడుతూ నెంబర్ల వెంటపడుతున్న దర్శకుల ట్రెండ్ లో శేఖర్ కమ్ముల మాత్రం సీతాకోకచిలుక వెనక పడుతున్నారంటూ కితాబు ఇవ్వడం బాగుంది. ఈ కథను సార్ కంటే ముందే చెప్పారని వివరించాడు. తన మాటల్లో కుబేర మీద కాన్ఫిడెన్స్ స్పష్టంగా వినిపించింది.
చివర్లో నాగార్జున మాట్లాడుతూ ధనుష్ కు ఫ్లైట్ టైం అవుతుంది కాబట్టి ముందు ఆయన్ని పంపించేద్దామని చెప్పి తనతో పని చేయడం గురించి గొప్పగా చెప్పారు. ఇది మా ఎవరి సినిమా కాదని, శేఖర్ కమ్ముల చిత్రమని, మేమంతా కేవలం పాత్రధారులమని, మా అందరితో పాటు తాను కూడా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి తీశారని ప్రశంసలతో ముంచెత్తారు. మాయాబజార్ ఎలాగైతే కెవి రెడ్డి గారి క్లాసిక్ అని చెప్పుకుంటారో అలాగే కుబేర కూడా శేఖర్ కమ్ముల సినిమాగా గుర్తు పెట్టుకుంటారని ప్రశంసించారు. మొత్తానికి చక్కని కబుర్లతో కుబేర ఈవెంట్ కోలాహలంగా జరిగింది. అన్నట్టు శివ 4కె వస్తున్న శుభవార్తని నాగ్ ఇదే స్టేజి మీద చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates