‘కన్నప్ప’.. ‘తుడరుమ్’ను మించాలి-మోహన్ బాబు

టాలీవుడ్ నుంచి రాబోతున్న తర్వాతి పాన్ ఇండియా సినిమాల్లో ‘కన్నప్ప’ ఒకటి. ఈ నెల 27న ఈ చిత్రం దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. మంచు ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్ర బడ్జెట్ రూ.200 కోట్ల పైమాటే. నిన్ననే ‘కన్నప్ప’ ట్రైలర్ లాంచ్ జరిగింది. ఇందుకు కేరళలోని కొచ్చి వేదికగా నిలవడం విశేషం. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ కీలక పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఆయన సొంతగడ్డ మీదే ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఏర్పాటు చేసింది కన్నప్ప బృందం.

ఈ వేదిక మీద మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘కన్నప్ప’ సినిమా.. మలయాళంలో ఆల్ టైం బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలిచిన ‘తుడరుమ్’ చిత్రాన్ని అధిగమించాలని మోహన్ బాబు ఆకాంక్షించడం విశేషం. కేవలం కేరళలోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అక్కడ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది ‘తుడరుమ్’. ఆ చిత్రం కంటే కేరళలో ఒక్క రూపాయి అయినా ‘కన్నప్ప’ ఎక్కువగా వసూలు చేయాలని మోహన్ బాబు పేర్కొన్నారు. ‘కన్నప్ప’ లాంటి చిత్రానికి భాషతో సంబంధం లేదని.. ఈ చిత్రానికి మలయాళంలో మంచి ఆదరణ దక్కుతుందనే నమ్మకం ఉందని మోహన్ బాబు అన్నారు.

మరోవైపు మోహన్ లాల్ మాట్లాడుతూ.. మోహన్ బాబు మీద ప్రశంసల జల్లు కురిపించారు. మోహన్ బాబు స్వీటెస్ట్ పర్సన్ అని, తనను ‘కన్నప్ప’ మేకింగ్ టైంలో చాలా బాగా చూసుకున్నారని అన్నారు. మోహన్ బాబు సినిమాలో తాను విలన్ పాత్ర పోషించాలని ఆశిస్తున్నట్లు లాల్ చెప్పడంతో ఆడిటోరియం హోరెత్తింది. వెంటనే మోహన్ బాబు మైక్ అందుకుని తానే మోహన్ లాల్ సినిమాలో విలన్ పోషించాలి అనుకుంటున్నట్లు చెప్పాడు. దీనికి మోహన్ లాల్ బదులిస్తూ.. అలా అయితే తొలి సన్నివేశంలోనే గన్ తీసుకుని మిమ్మల్ని కాల్చి పడేస్తా అంటూ చమత్కరించారు.