దేశభక్తిని ప్రశ్నించొద్దన్న అమీర్ ఖాన్

ఇంకో అయిదు రోజుల్లో విడుదల కాబోతున్న సితారే జమీన్ పర్ కోసం అమీర్ ఖాన్ చేస్తున్న ప్రమోషన్లు మాములుగా లేవు. సహజంగా తన మూవీ వస్తుందంటే ఆడియన్స్ లో ఓ రేంజ్ అంచనాలుంటాయి. కానీ ఈ చిత్రం విషయంలో మాత్రం కాసింత తక్కువగా ఉండటం ఫ్యాన్స్ ని కలవరపెడుతోంది. మాస్ అప్పీల్ లేని కంటెంట్ కావడం, పాటలు చార్ట్ బస్టర్ కాకపోవడం, ట్రైలర్ మీద నెగటివ్ కామెంట్స్ వినిపించడం లాంటి కారణాలు హైప్ మీద ప్రభావం చూపించాయి. అయితే అమీర్ వాటిని లెక్క చేయడం లేదు. భాషతో సంబంధం లేకుండా అన్ని మీడియాలకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో పలు సంగతులు పంచుకున్నాడు.

వీటిలో దేశభక్తి ప్రస్తావన వచ్చింది. వాటి గురించి అమీర్ వివరణ ఇచ్చాడు. పెహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్ సమయంలో అమీర్ ఖాన్  నుంచి ఎలాంటి  స్పందన లేదు. వాటికి కారణం తను సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా వుండకపోవడమే. కానీ ఆ సంఘటనలు జరిగిన సమయంలోనే తన ట్రైలర్ లాంచ్ ని పది రోజుల పాటు వాయిదా వేసుకున్నాడు. యాంటీ పాకిస్థాన్ కథలు చాలానే వచ్చినా వాటిలో అమీర్ నటించలేదు. సామాజిక స్పృహ రగిలించడానికి సత్యమేవ జయతే షో చేశాడు. గ్రామీణాభివృద్ధి కోసం పాని ఫౌండేషన్ స్థాపించి వాటి ద్వారా ఎన్నో ప్రాంతాల సమస్యలు తీరుస్తున్నాడు.

సర్ఫరోష్, మంగళ్ సింగ్ పాండే, లగాన్ లాంటి సినిమాలన్నీ యువతలో దేశం పట్ల దృక్పధం మార్చే సినిమాలే. అమీర్ రిస్క్ చేసి వీటిని ఎందుకున్నాడు. లగాన్ ఎందరో తిరస్కరణకు గురైతే తానే నిర్మాతగా మారి రిస్క్ చేశాడు. అసలు గత కొన్ని దశాబ్దాల్లో సినీ పరిశ్రమ, దేశ ప్రగతి కోసం తాను చేసిన సినిమాలు, సేవలు ఎవరూ చేయలేదు. దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ చైనాలో కూడా ఆడేందుకు కారణంలో వాటిలో ఉన్న మానవతా విలువలే. పాన్ మసాలా యాడ్స్ కి సైతం దూరంగా ఉండే అమీర్ పైవిషయాలన్నీ కూలంకుషంగా చెప్పి తన దేశభక్తిని ప్రశ్నించొద్దు అంటున్నారు. ఇదే అమీర్ గతంలో ఇండియాలో భద్రత లేదనే తరహాలో చేసిన కామెంట్లు పెద్ద దుమారం రేపడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.