మార్కో 2 ఎందుకు ఆపేశారంటే

గత ఏడాది పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై సంచలన విజయం సాధించిన మలయాళం మూవీ మార్కోకి వసూళ్లతో పాటు విమర్శలు చాలా బలంగా వచ్చాయి. మితిమీరిన వయొలెన్స్ తో ప్రేక్షకులు జడుసుకునే స్థాయిలో హత్యలు చూపించిన తీరు మీద చాలా క్రిటిసిజం వచ్చింది. నార్త్ లో పలు థియేటర్లలో ఫ్యామిలీ ఆడియన్స్ ఫిర్యాదు చేస్తే షోలు క్యాన్సిల్ చేసిన దాఖలాలున్నాయి. ఎంత హింస పెట్టినా మాస్ ఈ మార్కోని బాగా ఆదరించింది. అప్పటిదాకా టయర్ 2 & 3 మధ్య ఊగిసలాడుతున్న హీరో ఉన్ని ముకుందన్ కి ఇతర భాషల్లో పాపులారిటీ తెచ్చి పెట్టింది. అప్పటి నుంచే మార్కో 2 కోసం డిమాండ్ ఉంది.

తాజాగా మార్కోని కొనసాగించడం లేదని ఉన్ని ముకుందన్ స్వయంగా ప్రకటించాడు. సోషల్ మీడియాలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ దీని మీద విపరీతమైన నెగటివిటీ ఉందని, అందుకని కొనసాగించే ఉద్దేశం లేదని, ఇంతకన్నా మెరుగైన సినిమాతో మిమ్మల్ని అలరిస్తానని చెప్పి ప్రచారాలకు చెక్ పెట్టేశాడు. వాస్తవానికి దీని వెనుక వేరే కథ ఉందట. మార్కో దర్శకుడు అనీఫ్ అదేని తెలుగులో ఒక ప్రాజెక్టుకి సంతకం చేశాడు. దిల్ రాజు నిర్మాణంలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఆ స్క్రిప్ట్ పనుల్లోనే బిజీగా ఉండటం వల్ల మార్కో 2 మీద ఎలాంటి ఫోకస్ పెట్టలేకపోతున్నాడు.

పైగా మార్కో నిర్మాతలకే సీక్వెల్ మీద ఆసక్తి లేదు. ఇంతకన్నా వయొలెన్స్ తో పార్ట్ 2 తీస్తే తమ బ్యానర్ కు చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని గుర్తించి డ్రాప్ అయ్యారు. ఆ హక్కులను కూడా ఎవరికీ ఇచ్చే ఉద్దేశంలో లేరట. ప్రాక్టికల్ గా చూస్తే ఉన్ని ముకుందన్ కు చేయాలని ఉన్నా ప్రొడ్యూసర్, డైరెక్టర్ వైపు నుంచి సహకారం లేనప్పుడు తాను మాత్రం ఏం చేయాలగలడు. అనీఫ్ అదేని ఎవరి కోసం కథ రాస్తున్నాడనే లీక్ బయటికి రాలేదు కాని బాలకృష్ణ పేరు బలంగా వినిపిస్తోంది. ఏదైతేనేం మార్కో 2కి క్యాన్సిల్ చేసి మంచి పని చేశారు. ఇలాంటి కంటెంట్లు ఒక్క భాగంతోనే ఆగిపోవడం ఒకరకంగా మంచిదే.