నాగ్‌తో కమ్ముల అలా.. లోకేష్ ఇలా

టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ప్రస్తుతం నా రూటే సపరేటు అన్నట్లు సాగిపోతున్నారు. సోలో హీరోగా ఏడాదిన్నరగా కొత్త సినిమా ఏదీ చేయని నాగ్.. రెండు సినిమాల్లో ప్రత్యేక పాత్రలతో పలకరించబోతున్నారు. ఆ రెండు చిత్రాల్లో తమిళ స్టార్లే హీరోలు కాగా.. నాగ్ చేస్తున్న పాత్రలు ఆ హీరోలకు దీటైనవిగానే కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఒక పాత్రకు, ఇంకో పాత్రకు అసలు సంబంధం లేనట్లే కనిపిస్తోంది. అందులో ఒక పాత్ర సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రం ‘కూలీ’ కాగా.. ఇంకోటి రజినీ మాజీ అల్లుడు ధనుష్ లీడ్ రోల్ చేసిన ‘కుబేర’. ఈ రెండు చిత్రాల్లో పని చేయడం తనకు చాలా కొత్త అనుభవమని అంటున్నాడు నాగ్.

ఆ రెండు చిత్రాల్లో ఒకదాంతో ఒకటి సంబంధం లేని పాత్రలు చేశానని.. వాటిలో వైరుధ్యం చూపించడం తనకు కష్టమైందని.. అందుక్కారణం వాటి దర్శకుల శైలి కూడా భిన్నం కావడం కారణమని నాగ్ ప్రముఖ తమిళ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘కుబేర’ సినిమాలో తాను హీరోయిగ్గా నడిచి వస్తుంటే.. అలా వద్దని, డోస్ తగ్గించమని.. కామ్ డౌన్ అని చెప్పినట్లు నాగ్ తెలిపాడు. అదే సమయంలో ‘కూలీ’ సినిమా కోసం తాను మామూలుగా వస్తుంటే.. మీరు టైగర్ లాగా ఎంట్రీ ఇవ్వాలి అంటూ దర్శకుడు లోకేష్ కనకరాజ్ చెప్పినట్లు నాగ్ తెలిపాడు.

ఇలా ఒకే సమయంలో ఇద్దరు భిన్నమైన దర్శకులతో పని చేశానని.. తన పాత్రల స్వభావం కూడా పూర్తిగా భిన్నమని.. ఈ రెండు పాత్రలకు న్యాయం చేయడం సవాలుగా మారిందని నాగ్ తెలిపాడు. ఇక ‘కూలీ’ సినిమా గురించి చెబుతూ.. సినిమా అంతా ప్రేక్షకులు విజిల్స్ కొడుతూనే ఉంటారని.. ఇది విజిల్స్ సినిమా అని.. మాస్ ప్రేక్షకులకు ఇది విందు భోజనంలా ఉంటుందని నాగ్ చెప్పాడు. లోకేష్ కనకరాజ్ మాస్‌ను చాలా స్టైలిష్ ‌గా ప్రెజెంట్ చేసే దర్శకుడని.. అలాంటి దర్శకుడితో పని చేయడం తనకు కొత్తగా అనిపించిందని నాగ్ అభిప్రాయపడ్డాడు. ‘కుబేర’ ఈ నెల 20నే ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ‘కూలీ’ ఆగస్టు 14న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.