ధనుష్.. నాగార్జున.. రష్మిక మందన్నా.. శేఖర్ కమ్ముల.. ఇలాంటి కాంబినేేషన్లో ఒక సినిమా వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఈ వెరైటీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘కుబేర’ ఇంకో పది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మేకింగ్ కొంచెం ఆలస్యమై ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే ఉన్న ఈ సినిమాకు ఎట్టకేలకు ప్రమోషన్లు మొదలుపెట్టింది చిత్ర బృందం. పాన్ ఇండియా స్థాయిలో సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ రోజు ముంబయిలో టీం ప్రమోషనల్ ఈవెంట్ చేసింది. ఇందులో ధనుష్, రష్మిక, నాగార్జున ముగ్గురూ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ధనుష్ ఈ సినిమా తనలో తెచ్చిన మార్పు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నటీనటులందరం ఒక కంఫర్ట్ జోన్లో, సురక్షితంగా ఉంటామని.. ప్రపంచంలో మరోవైపు ఏం జరుగుతోందో చూడమని.. కానీ తనకు ‘కుబేర’ అది చూపించిందని అతను వ్యాఖ్యానించాడు. ఈ సినిమా కోసం చెత్త కుప్పల మధ్య సన్నివేశాలు చిత్రీకరించినట్లు అతను తెలిపాడు. తాను, రష్మిక కలిసి ఒక రోజు ఆరేడు గంటల పాటు డంప్ యార్డ్లోనే ఉండి షూట్ చేశామన్నాడు ధనుష్. ఆ టైంలో రష్మిక మాత్రం తనకు ఎలాంటి దుర్వాసనా రాలేదంటూ మామూలుగా ఉందని అతను వెల్లడించాడు. తాను చాలా సాధారణ కుటుంబం నుంచి వచ్చానని.. ఈ సినిమా చేస్తుండగా తనకు చిన్ననాటి రోజులు గుర్తుకువచ్చాయని అతనన్నాడు. నాగార్జునతో కలిసి నటించడం గొప్ప అనుభవమని తెలిపాడు ధనుష్.
ఇక నాగ్ మాట్లాడుతూ.. సౌత్ స్టార్, నార్త్ స్టార్ అంటూ హీరోలను విభజించి మాట్లాడొద్దని విజ్ఞప్తి చేశాడు. తన సినిమాలను నార్త్ ప్రేక్షకులు ఎంతగానో ఆదరించిన విషయాన్ని అతను గుర్తు చేశాడు. అలాగే తాము కూడా హిందీ సినిమాలను ఎప్పట్నుంచో చూస్తున్నామన్నాడు. ధనుష్ ఒక రోజు ఉన్నట్లు ఇంకో రోజు ఉండడని.. ఎప్పటికప్పుడు నటుడిగా పరివర్తన చెందుతుంటాడని.. తనతో కలిసి సినిమా చేయడం గొప్ప అనుభవమని అన్నాడు. తాను రొటీన్ సినిమాలతో విసిగిపోతూ, తర్వాత ఏ చిత్రం చేయాలో తెలియక అయోమయంలో ఉన్నపుడు శేఖర్ కమ్ముల ‘కుబేర’ లాంటి వెరైటీ సబ్జెక్ట్ చెప్పి తనను ఇంప్రెస్ చేశాడన్నాడు. రష్మిక గురించి మాట్లాడుతూ.. తాము వెయ్యి కోట్లు, రెండు వేల కోట్ల సినిమాలు చేయలేదని.. ఆమె మాత్రం వాటిలో భాగం అవుతోందని చమత్కరించాడు నాగ్.