ఐమాక్స్ కల…తీర్చనున్న ఎస్ఎస్ఎంబి 29

హైదరాబాద్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కల ఐమ్యాక్స్ థియేటర్. సిటీలో బోలెడు మల్టీ ప్లెక్సులు, సింగల్ స్క్రీన్లు ఉన్నప్పటికీ అసలైన కిక్ ఇచ్చే తెర లేకపోవడం ఎప్పటి నుంచో వెలితిగా ఫీలవుతున్నారు. జనాభా, విస్తీర్ణంలో భాగ్యనగరం కన్నా చిన్నవైన కోచి, పూణే లాంటి ప్రాంతాల్లో ఉన్న ఐమాక్స్ తెలుగు రాష్ట్రాల్లో లేకపోవడం గురించి సోషల్ మీడియా ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ త్వరలో హకీం పేటలో ఐమాక్స్ ని తీసుకొచ్చే ప్లానింగ్ జరుగుతోందనే శుభవార్త చెప్పడం సినీ ప్రియుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.

ఎప్పటి నుంచనేది నిర్ధారణగా చెప్పలేదు కానీ 2027లో ప్రారంభమవ్వొచ్చని హింట్ ఇచ్చారు. అంటే మహేష్ బాబు రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీతో దాని ఓపెనింగ్ జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రసాద్ మల్టీప్లెక్స్, సూళ్లూరుపేట వి సెల్యులాయిడ్స్ లో అతి పెద్ద స్క్రీన్లు ఉన్నప్పటికీ వాటిలో ఐమాక్స్ టెక్నాలజీ లేదు. తెర ఎంత భారీగా ఉన్నా పోలిక పరంగా చూసుకుంటే అనుభూతి తక్కువే. కాకపోతే ఉన్నవాటిలో బెస్ట్ విజువల్, సౌండ్ ఎక్స్ పీరియన్స్ అయితే ఇస్తున్నాయి. ఇప్పుడు ఐమాక్స్ వస్తే మాత్రం ప్రేక్షకులు అందులో సినిమా చూసేందుకు ఎగబడటం ఖాయం.

నిజానికి ఇంత ఆలస్యం కావడం వెనుక కారణాలు లేకపోలేదు. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలకు సంబంధించి గరిష్ట పరిమితి ఒకటుంది. దాన్ని దాటి రేట్ ఎక్కువ కావాలంటే ప్రభుత్వానికి విన్నపం చేసుకోవాలి. అది కూడా పరిమిత కాలానికి మాత్రమే ఇస్తారు. కానీ బెంగళూరు, ముంబై, కోచి లాంటి చోట ఈ సమస్య లేదు. గరిష్టంగా 2 వేల రూపాయలకు పైనే వసూలు చేసే అనుమతులు ఉంటాయి. ప్రతిసారి పర్మిషన్లు అక్కర్లేదు. కానీ ఏపీ తెలంగాణలో అలా సాధ్యం కాదు. ఇప్పుడు ఐమాక్స్ కనక సానుకూల ధరతో టికెట్లు పెడితే కనక హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా తెలుగు, ఇంగ్లీష్ సినిమాలు బాగా ఆస్వాదించవచ్చు.