ఒకప్పుడు వరుస హిట్లతో టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు శ్రీను వైట్ల. కానీ ‘ఆగడు’ సినిమా నుంచి ఆయన జాతక తిరగబడింది. అక్కడ్నుంచి ఆయనకు విజయమే దక్కలేదు. బ్రూస్లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ.. ఇలా వరుసగా డిజాస్టర్లు చూశాడు. ‘అమర్..’ తర్వాత చాలా ఏళ్ల పాటు ఆయన సినిమానే చేయలేదు. చివరికి గోపీచంద్ హీరోగా ‘విశ్వం’ తీశాడు. ఈ సినిమా ఒక బేనర్లో మొదలై. తర్వాత చేతులు మారింది. సినిమా పూర్తి చేయడంలో కొన్ని ఇబ్బందులు తప్పలేదు.
మొత్తానికి ‘విశ్వం’ సినిమాను ఎలాగోలా ఫినిష్ చేసి గత ఏడాది దసరా సీజన్ల్ రిలీజ్ చేయగా.. దీనికి నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. ఐతే వైట్ల గత చిత్రాలతో పోలిస్తే దీనికి స్పందన కొంచెం మెరుగ్గా కనిపించింది. శ్రీను వైట్ల అయితే ఈ సినిమా రిజల్ట్ విషయంలో తాను పూర్తి సంతృప్తితో ఉన్నట్లు చెప్పాడు. ‘విశ్వం’ థియేటర్లో బాగా ఆడిందని.. ఓటీటీలో కూడా దీనికి మంచి స్పందన వచ్చిందని వైట్ల చెప్పాడు. నిజానికి ఈ విజయాన్ని తాను సెలబ్రేట్ చేసుకోవాల్సిందని.. కొన్ని కారణాల వల్ల అది జరగలేదని వైట్ల చెప్పాడు. ‘విశ్వం’ సినిమాకు తొలి రోజు వచ్చిన వసూళ్లతో పోలిస్తే రెండో రోజు నాలుగు రెట్లు ఎక్కువ కలెక్షన్లు వచ్చినట్లు వైట్ల తెలిపాడు.
ఈ రోజుల్లో సినిమా బాలేదంటే రెండో రోజుకే ఫినిష్ అయిపోతుందని.. కానీ ‘విశ్వం’కు వసూళ్లు పెరుగుతూ పోయాయని.. ఓవరాల్గా మంచి కలెక్షన్లు వచ్చాయని.. ఇందులో కామెడీ ప్రేక్షకులకు నచ్చిందని వైట్ల చెప్పాడు. మూడో వారంలో కూడా నైజాంలో 140 థియేటర్లలో సినిమా నిలబడిందని.. కానీ ముందు చేసుకున్న ఒప్పందం వల్ల సినిమాను సడెన్గా ఓటీటీలోకి తీసుకొచ్చేశారని.. ఐతే అక్కడ రిలీజైన దగ్గర్నుంచి టాప్లో ట్రెండ్ అయిందని వైట్ల తెలిపాడు. ప్రొడక్షన్ హౌస్ మారడం, బయటికి చెప్పలేని కొన్ని కారణాల వల్ల ఈ సినిమా సక్సెస్ను సెలబ్రేట్ చేయలేదని.. తనకు మాత్రం ‘విశ్వం’ గొప్ప రిలీఫ్ ఇచ్చిందని.. దాని ఫలితం విషయంలో తాను చాలా హ్యాపీ అని వైట్ల అన్నాడు.