కూలీలో అమీర్ ఖాన్ ఎందుకు ప్రత్యేక పాత్ర పోషించాడనే అనుమానం ముందు నుంచి అభిమానుల్లో లేకపోలేదు. ఏనాడూ తమిళ తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపని అమీర్ హఠాత్తుగా లోకేష్ కనగరాజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎట్టకేలకు దానికి సమాధానం దొరికింది. లోకేష్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సూర్య హీరోగా ఒక పవర్ ఫుల్ సబ్జెక్టు రాసుకున్నాడు. అదే ఇరుంబు కై మాయావి. యాక్సిడెంట్ లో ఒక చేయి పోగొట్టుకున్న యువకుడు దాన్ని లోహాలతో చేసిన కృత్రిమ చేయిగా మార్చుకుంటాడు. దాని వల్ల అతనికి అద్వితీయ శక్తులు వస్తాయి.
అక్కడి నుంచి సూపర్ హీరో అవుతాడు. అక్కడి నుంచి అసలు కథ షురూ. దీనికి పెద్ద ఎత్తున స్పెషల్ ఎఫెక్ట్స్ అవసరం. అనుభవం లేని లోకేష్ మీద అంత బడ్జెట్ పెట్టేందుకు ఏ నిర్మాతా సాహసించలేదు. క్రమంగా సూర్య కూడా సైడ్ తీసుకున్నాడు. కట్ చేస్తే ఇప్పుడు లోకేష్ కనగరాజ్ మార్కెట్ కి ఏ స్టోరీ అయినా వందల కోట్లతో ప్రొడ్యూసర్లు సిద్ధంగా ఉన్నారు. అందుకే ఇప్పుడా ఇరుంబు కై మాయావిని బయటికి తెస్తున్నాడు. ఇదే సబ్జెక్టుని మరింత మెరుగ్గా రాసుకుని అమీర్ ఖాన్ కి గత ఏడాదే చెప్పి ఒప్పించినా సెట్స్ మీద వెళ్ళడానికి టైం పట్టింది. 2026 సెకండాఫ్ తర్వాత షూటింగ్ ప్రారంభం కాబోతోంది.
ఇది స్టార్టవుతున్న విషయం అమీర్ ఖాన్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పేశాడు. అంటే కూలి రిలీజయ్యాక ఖైదీ 2 మొదలుపెట్టే లోకేష్ కనగరాజ్ దాన్ని త్వరగా ఫినిష్ చేసి ఇరుంబు కై మాయావి మీదకోస్తాడు. అయితే టైటిల్ మారుతుంది లెండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటిదాకా బాలీవుడ్ సూపర్ హీరో అంటే గుర్తొచ్చే పేరు క్రిష్ ఒకటే. ఇప్పుడు దాన్ని తలదన్నేలా లోకేష్ కనగరాజ్ స్క్రిప్ట్ తయారు చేస్తున్నట్టు సమాచారం. హీరోయిన్, సాంకేతిక బృందం తదితర వివరాలు ఇంకా తెలియలేదు. 2027 చివరిలో విడుదల చేసే లక్ష్యంతో త్వరలోనే మొదలుపెట్టబోతున్నట్టు టాక్.