రాజేంద్రుడిని వాడుకునే విధానం ఇది కాదు

టాలీవుడ్ లో ఇప్పుడు చాలా బిజీగా ఉన్న సీనియర్ ఆర్టిస్టుల్లో నటకిరీటీ రాజేంద్రప్రసాద్ ముందు వరుసలో ఉన్నారు. స్టార్ హీరోలైనా మీడియం బడ్జెట్ లైనా కీలకమైన పాత్రలకు ఆయన్నే తీసుకుంటున్నారు. చేతిలో పదకొండుకి పైగా సినిమాలతో వెంటనే డేట్లు ఇవ్వలేనంత టైట్ షెడ్యూల్స్ లో ఉన్నారు. అయితే రాజేంద్రుడిని లీడ్ రోల్ లో పెట్టి తక్కువ బడ్జెట్ లో చిత్రాలు తీస్తున్న నిర్మాతలకు అవేమంత ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోతున్నాయి. ఇటీవలే షష్ఠిపూర్తి వచ్చింది. లేడీస్ టైలర్ వచ్చిన నలభై సంవత్సరాల తర్వాత అర్చనతో కలిసి నటించిన మూవీ ఇది. ఓపెనింగ్స్, పబ్లిక్ టాక్ రెండూ నిరాశాజనకంగా ఉన్నాయి.

ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ ని వేలెత్తి చూపడానికి ఏం లేదు. ఎందుకంటే తన వరకు దర్శకులు అడిగింది చేస్తున్నారు. నటన పరంగా బెస్ట్ ఇస్తున్నారు. కాకపోతే వాళ్లకు ఈయన్ని వాడుకోవడమే సరిగా రావడం లేదు. గత కొన్నేళ్లను పరిగణనలోకి తీసుకునే నట కిరిటీని లీడ్ రోల్ లో పెట్టి వచ్చిన లగ్గం, ఉత్సవం, కృష్ణారామా, అనుకోని ప్రయాణం అన్నీ ఫ్లాపయ్యాయి. వీటిలో యువ హీరో హీరోయిన్లు విడిగా ఉన్నప్పటికీ ప్రమోషన్లు మొత్తం రాజేంద్ర ప్రసాద్ ని ముందు పెట్టే చేశారు. కానీ పనవ్వడం లేదు. థియేటర్ కు జనాన్ని రప్పించేంత ఫుల్ తనలో తగ్గిపోవడమే ఒక కారణంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక షష్ఠిపూర్తి విషయానికి వస్తే ఇళయరాజా సంగీతం గురించి గొప్పగా పబ్లిసిటీ చేశారు. ఎప్పుడూ లేనిది ఆయన తెలుగు మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రెస్ మీట్ కి వచ్చి నాలుగు కబుర్లు పంచుకున్నారు. రాజేంద్రప్రసాద్ చాలా ఎగ్జైట్ మెంట్ తో సినిమా గురించి గొప్పగా వర్ణించారు. ఇంత చేసినా సినిమా జనాలకు రీచ్ కాలేదు. ఖలేజా రీ రిలీజ్, భైరవం లాంటి పెద్ద సినిమా పోటీ దీన్ని వెనక్కు తోశాయి. పోనీ టాక్ ఎక్స్ ట్రాడినరిగా వచ్చి పికప్ అవుతుందనుకుంటే అదీ జరగలేదు. ఇలాంటివి ఓటిటిలో చూద్దాం లెమ్మనే ఆడియన్స్ ఆలోచనా విధానం కూడా ఈ పరిస్థితికి కారణంగా చెప్పొచ్చు.