=

అసలు తుస్… కొసరు ప్లస్

చిన్న వయసులోనే సినిమాటోగ్రాఫర్‌గా ప్రతిభ చాటుకుని.. ‘సూర్య వెర్సస్ సూర్య’ సినిమాతో దర్శకుడిగా మారాడు కార్తీక్ ఘట్టమనేని. ఆ సినిమా ఓ మోస్తరు ఫలితాన్నందుకుంది. అతను తర్వాత చాలా ఏళ్ల పాటు మళ్లీ మెగా ఫోన్ పట్టలేదు. ఐతే గ్యాప్ తర్వాత అతడికి బంపర్ ఆఫర్ తగిలింది. మాస్ రాజా రవితేజతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లాంటి హ్యాపెనింగ్ బేనర్లో పెద్ద బడ్జెట్లో సినిమా చేసే అవకాశం వచ్చింది. ఆ చిత్రమే.. ఈగల్. ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు భారీ అంచనాలే నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్ వేరే లెవెల్లో ఉండడంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకున్నారు. కానీ అంచనాలు తలకిందులయ్యాయి.

‘ఈగల్’ రవితేజ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాపై భారీ పెట్టుబడి పెట్టిన పీపుల్స్ మీడియా సంస్థకు బ్యాండ్ తప్పలేదు. ఐతే ‘ఈగల్’ మేకింగ్ దశలో ఉండగానే.. కార్తీక్ ఇదే బేనర్లో ఇంకో సినిమా ప్లాన్ చేశాడు. అప్పటికి తేజ సజ్జా ‘హనుమాన్’ రిలీజ్ కాలేదు. పీపుల్స్ మీడియా బేనర్లో ‘ఈగల్’ లాంటి పెద్ద బడ్జెట్ సినిమా చేస్తూనే బోనస్‌గా అదే బేనర్లో తేజ సినిమా చేస్తున్నట్లు కనిపించాడు కార్తీక్. దీన్ని చిన్న సినిమాగానే భావించారు. తక్కువ రోజుల్లో, పరిమిత బడ్జెట్లో సినిమా లాగించేద్దాం అన్నట్లే మొదలుపెట్టారు. కానీ తర్వాత కథ మారిపోయింది.

‘హనుమాన్’ రిలీజై భారీ విజయం సాధించడం, తేజ ఫాలోయింగ్ పెరిగిపోవడం, ‘మిరాయ్’ కథ స్పాన్ పెద్దదిగా కనిపించడంతో పీపుల్స్ మీడియా భారీ స్థాయిలోనే ఈ సినిమా చేయడానికి ప్రణాళికలు మార్చింది. దాని ఫలితం ఈ రోజు రిలీజైనే టీజర్లోనే కనిపించేసింది. ఇది ఇన్నాళ్లూ అనుకుంటున్నట్లు చిన్న సినిమా కాదని.. దీని లెవెలే వేరని టీజర్లో విజువల్స్, ఎఫెక్ట్స్, భారీతనం స్పష్టం చేశాయి. ఆదిపురుష్, విశ్వంభర లాంటి భారీ చిత్రాలు వీఎఫెక్స్ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటే.. ‘మిరాయ్’ టీం రాబట్టిన ఔట్ పుట్ ఔరా అనిపిస్తోంది. ‘మిరాయ్’ మీద పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు ఏర్పడుతున్నాయి.

‘హనుమాన్’ తర్వాత తేజకు సరైన ఫాలోఅప్ మూవీలా కనిపిస్తోంది ‘మిరాయ్’. టీజర్ ఉన్నంత గొప్పగా సినిమా కూడా ఉంటే దీని బాక్సాఫీస్ సక్సెస్ కూడా ఊహించని స్థాయిలో ఉండొచ్చు. అసలు కంటే కొసరు ఎక్కువైనట్లు.. పీపుల్స్ మీడియా బేనర్లో భారీ సినిమా అనుకున్న ‘ఈగల్’ తుస్సుమనిపిస్తే.. కార్తీక్ బోనస్ మూవీలా చిన్నగా చేయాలనుకున్న ‘మిరాయ్’ వేరే స్థాయికి వెళ్లేలా కనిపిస్తుండడం విశేషమే.