కుబేరను కవ్విస్తున్న 8 వసంతాలు

జూన్ 20 విడుదల కాబోతున్న కుబేర మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటిదాకా వదిలిన ప్రమోషనల్ కంటెంట్ మాస్ వర్గాల్లో విపరీతమైన అంచనాలు రేపకపోయినా దర్శకుడు శేఖర్ కమ్ములను తక్కువంచనా వేయడానికి లేదు. అందులోనూ ధనుష్, నాగార్జున కలయికని సాధ్యం చేయడం ద్వారా ప్రాజెక్టు ప్రారంభ దశ నుంచే మంచి హైప్ తీసుకొచ్చాడు. హీరోయిన్ రష్మిక మందన్న, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం లాంటి బోలెడు అట్రాక్షన్లు అభిమానుల్లో బజ్ పెంచుతున్నాయి. హరిహర వీరమల్లు వచ్చిన వారానికే కుబేర రిలీజవుతున్నప్పటికీ నిర్మాతలు కంటెంట్ మీద నమ్మకంతో ఉన్నారు.

ఇదిలా ఉండగా అదే రోజు 8 వసంతాలు అనే చిన్న సినిమాని మైత్రి మూవీ మేకర్స్ తీసుకొస్తోంది. మను ఫేమ్ ఫణింద్ర నరిశెట్టి దర్శకత్వం వహించిన ఈ పొయెటిక్ లవ్ స్టోరీలో ఊహించని అంశాలు చాలా ఉంటాయట. ఆ మధ్య వచ్చిన టీజర్ ఇంటరెస్టింగ్ అనిపించింది. వందల వేల కోట్లతో ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తున్న మైత్రి సంస్థ దీనికి నిర్మాతగా వ్యవహరించడం చూస్తుంటే ఇదేదో ఆషామాషీ కథగా అనిపించడం లేదు. అనంతిక సానిల్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్న 8 వసంతాలుకి హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూర్చడం ప్రధాన ఆకర్షణ. రవితేజ దుగ్గిరాల హీరోగా నటిస్తున్నాడు.

ఇక్కడ గమనించాల్సిన బిజినెస్ కోణం ఒకటుంది. కుబేరకు ఏషియన్ సంస్థ ప్రధాన నిర్మాణ భాగస్వామి. డిస్ట్రిబ్యూషన్ పరంగా సురేష్ బాబుతో పాటు దిల్ రాజు మద్దతు ఉంటుంది. మైత్రి తన నెట్ వర్క్ ని నమ్ముకుని 8 వసంతాలు తెస్తోంది. పెద్ద ఎత్తున స్క్రీన్లు అవసరం లేదు కానీ తన కంట్రోల్ లో ఉన్న వాటిలో రిలీజ్ చేసుకుంటే చాలనే ఎత్తుగడలో ఉంది. ఒకవేళ పాజిటివ్ టాక్ వచ్చి వర్కౌట్ అయితే ఆటోమేటిక్ గా థియేటర్లు పెరుగుతాయి. జూలై, ఆగస్ట్ లో భారీ బడ్జెట్ సినిమాలున్న నేపథ్యంలో 8 వసంతాలుకు ఎలా చూసుకున్నా జూన్ 20 బెస్ట్ డేటే. కాకపోతే కుబేర కాంపిటీషన్ ఎలా ఫేస్ చేస్తుందో చూడాలి.