పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్ దుర్ఘటన అల్లు అర్జున్ ని ఎంతగా వేటాడిందో అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా అంత సులభంగా మర్చిపోలేరు. కోర్టుకు హాజరు కావడం, పోలీస్ స్టేషన్ కు వెళ్లడం, జైలు దాకా వెళ్లి బెయిలు తెచ్చుకోవడం ఇవన్నీ బన్నీ కల్లో కూడా ఊహించని పరిణామాలు. ఇవి చాలవన్నట్టు నేరుగా తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ఈ సంఘటనను సీరియస్ గా తీసుకోవడం కథను రకరకాల మలుపులు తిప్పింది. కోరుకుని జరిగింది కాకపోయినా బన్నీ పడిన నరకం అంతా ఇంతా కాదు. ఈ ప్రమాదం వల్ల ఒక కుటుంబానికి జరిగిన అన్యాయం నెలల తరబడి మీడియాలో హైలైట్ అయ్యింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం పలు సందర్భాల్లో దీని గురించి విరుచుకుపడిన వైనం విదితమే. ఇవాళ ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో ఉత్తమ నటుడి పురస్కారం అల్లు అర్జున్ కి ఇవ్వడం ద్వారా ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికట్టు అయ్యింది. అందులో ప్రధానమైంది బన్నీ పట్ల రేవంత్ సర్కారుకు ఎలాంటి వ్యక్తిగత కోపం లేదనేది. ఒకవేళ అలాంటిది ఉంటే కనక లక్కీ భాస్కర్, పొట్టెల్, 35 చిన్న కథ కాదు లాంటి సినిమాల్లో నటించిన హీరోలకు ఇచ్చి ఉండొచ్చు. కానీ పుష్ప 2 పెర్ఫార్మన్స్ ముందు అవన్నీ తక్కువే. అందుకే పర్సనల్ ఎజెండా లాంటివి పెట్టుకోకుండా బన్నీనే బెస్ట్ యాక్టర్ గా ఎంచుకోవడం మంచి ఆలోచన.
పుష్పలో నటనకు జాతీయ ఆవార్డే వచ్చినప్పుడు ఇప్పుడీ గద్దర్ గౌరవం దక్కడంలో ఎలాంటి ఆశ్చర్యం, అతిశయోక్తి లేదు. జూన్ 14 జరిగే వేడుకలో స్వయంగా రేవంత్ రెడ్డి చేతుల మీదుగానే అల్లు అర్జున్ అవార్డు తీసుకోవడం ఫ్యాన్స్ కి ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం కానుంది. సంధ్య థియేటర్ ఉదంతంలో జరిగిన వాదోపవాదాలు, పరస్పర కౌంటర్లకు ఈ సందర్భంగా చెక్ పడినట్టే. నష్టపోయిన బాధితులకు అల్లు ఫ్యామిలీ తరఫున, ఇటు గవర్మమెంట్ తరఫున సాయం అందుతోంది కాబట్టి ఇకపై ఈ ప్రస్తావన రాబోదనేది బన్నీ ఫ్యాన్స్ అంచనా. ఏదైతేనేం గద్దర్ అవార్డుల వల్ల కొన్ని ముఖ్యమైన సందేహాలు తీరిపోయినట్టే.