=

ప్రభాస్ అభిమానులకు కన్నప్ప కిక్కు

సరిగ్గా ఇంకో నెలలో జూన్ 27 విడుదల కాబోతున్న కన్నప్ప కోసం మంచు విష్ణు ప్రమోషన్ల వేగం పెంచాడు. మీడియాతో రెగ్యులర్ టచ్ లో ఉంటూ ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా విశేషాలు పంచుకుంటున్నాడు. కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీ డూ ఆర్ డై సిచువేషన్ లాంటిది. తన మాట, మోహన్ బాబు మీద గౌరవంతో ఎందరో స్టార్లు దీంట్లో భాగమయ్యారు. మొదటిసారి అక్షయ్ కుమార్ తెలుగులో డైలాగులు చెప్పాడు. వేరే హీరో సినిమాలో క్రేజీ ఆఫర్ వచ్చినా వద్దని చెప్పిన మోహన్ లాల్ పదిహేను నిమిషాల క్యామియో కోసం కన్నప్పకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అయితే అందరి దృష్టి ఎక్కువగా ఉన్నది ప్రభాస్ మీదే. మంచు విష్ణు చెప్పిన దాని ప్రకారం కన్నప్పలో ప్రభాస్ అరగంట కనిపించబోతున్నాడు. కేవలం కొన్ని నిముషాలు కనిపిస్తేనే ఫ్యాన్స్ ఊగిపోతారు. అలాంటిది ముప్పై నిమిషాలంటే వాళ్లకు పండగే పండగ. అసలే ది రాజా సాబ్ ఆలస్యంతో బాగా అసహనంతో ఉన్నారు. ఇప్పుడు కన్నప్ప దాన్ని తీర్చే బాధ్యత తీసుకున్నాడు. ఓపెనింగ్స్ భారీగా రావడంలో డార్లింగ్ కీలక పాత్ర పోషించబోతున్నాడు. మోహన్ బాబుతో జరిగే వాగ్వివాదం హైలైట్స్ లో ఒకటిగా ఉంటుందని చెబుతున్న విష్ణు దాన్ని థియేటర్లలో ఎంజాయ్ చేస్తారని హామీ ఇస్తున్నాడు.

సో అనుకున్న దానికన్నా ఎక్కువే ప్రభాస్ సందడి చేయబోతున్నాడు. ఇటీవలే విదేశాల నుంచి తిరిగి వచ్చిన డార్లింగ్ ముందు ఫౌజీలో పాల్గొనబోతున్నాడు. మధ్యలో కన్నప్ప డబ్బింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. జూన్ 27 విడుదలని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకూడదనే సంకల్పంతో విష్ణు అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏదైనా శివుడి క్షేత్రంలో చేసే ప్లానింగ్ జరుగుతోంది. ప్రభాస్ ని తీసుకురావాలనే  ఉద్దేశంతో డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన కన్నప్పకు ఉత్తరాదిలోనూ భారీ రిలీజ్ దక్కనుంది.