ఇటీవలే విడుదలైన వార్ 2 టీజర్ కొచ్చిన స్పందన చూసి యష్ రాజ్ ఫిలింస్ షాక్ తింది. యునానిమస్ గా పాజిటివ్ టాక్ వస్తుందనుకుంటే రివర్స్ లో ట్రోలింగ్ జరిగేంత స్థాయిలో క్రిటిసిజం మూటగట్టుకోవడం కథకుడు కం నిర్మాత ఆదిత్య చోప్రా ఊహించలేదు. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మొదటిసారి కలయిక కాబట్టి రెస్పాన్స్ అదిరిపోతుంది, యూట్యూబ్ వ్యూస్ లో రికార్డులు గల్లంతవుతాయని భావిస్తే అది కూడా జరగలేదు. మిలియన్ల కొద్దీ వచ్చాయి కానీ నెంబర్ వన్ కాలేకపోవడం ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. బాలీవుడ్ మీడియా సైతం పెదవి విరచడం ఊహించని పరిణామం.
ముంబై రిపోర్ట్ ప్రకారం వార్ 2 బృందం పోస్ట్ మార్టం చేసే పనిలో పడింది. ఫీడ్ బ్యాక్ ని సీరియస్ గా తీసుకుని ఎక్కువ కంప్లయింట్స్ దేని గురించి వచ్చాయో వాటి మీద మళ్ళీ వర్క్ చేయాలని నిర్ణయించుకుందట. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ గురించి ఎక్కువ కామెంట్స్ వచ్చాయి. పఠాన్ టైంలోనూ ఇవి వినిపించినప్పటికీ తర్వాత వాటిని సరిచేయడం ద్వారా డ్యామేజ్ తగ్గించారు. ఇప్పుడు వార్ 2కి అదే ఫార్ములా వాడబోతున్నారు. అసలు టీజర్ ఎడిటింగ్ సరిగా జరగలేదని, టైం ముంచుకురావడంతో హడావిడిగా కట్ చేయడం వల్ల అనవసరంగా లేనిపోని డ్యామేజ్ చేసుకున్నామని ఫీలవుతన్నారట.
వార్ 2కి ఇంతకన్నా పెద్ద సమస్య మరొకటుంది. ఆగస్ట్ 14 అదే రోజు వార్ 2తో విడుదల కాబోతున్న కూలి మీద హైప్ అంతకంతా పెరుగుతోంది. చిన్న చిన్న టీజర్లతోనే దర్శకుడు లోకేష్ కనగరాజ్ అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. ఇక ట్రైలర్ వచ్చాక ఎక్కడికి చేరుకుంటుందో ఊహించడం కష్టం. రెండు పోటాపోటీ సినిమాలు కావడంతో బయ్యర్ల నుంచి రేట్ల పరంగా డిమాండ్ ఎక్కువగా కూలికే వస్తోంది. ఏపీ తెలంగాణ, ఉత్తరాది వరకు వార్ 2 డామినేషన్ ఉంటుందనుకున్నా మిగిలిన రాష్ట్రాల్లో కూలి ఆధిపత్యాన్ని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఇప్పుడు వార్ 2 కు కావాల్సింది అదిరిపోయే ఓకే సాలిడ్ ట్రైలర్.