పవన్ సినిమా ఉండగా థియేటర్లు మూస్తారా?

దేశవ్యాప్తంగా థియేటర్ల పరిస్థితి రోజు రోజుకూ దుర్భరంగా తయారవుతోంది. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతుండడంతో వాటిని మెయింటైన్ చేయడం చాలా కష్టమవుతోంది. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఈ నేపథ్యంలో రెంట్ సిస్టంను పక్కన పెట్టి ఆదాయంలో వాటా కోరుతూ ఆంధ్ర-తెలంగాణల్లో ఎగ్జిబిటర్లు ఆందోళనకు సిద్ధమవడం చర్చనీయాంశంగా మారింది. తమ డిమాండ్‌కు అంగీకరించాల్సిందే అంటూ జూన్ 1 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు థియేటర్లను మూసేయడానికి సిద్ధపడుతున్నారన్న సమాచారం కలకలం రేపుతోంది.

డిమాండ్ల సాధన కోసం థియేటర్లను మూసేయాలని ఎగ్జిబిటర్లు ఇచ్చిన పిలుపు మీద ఇప్పుడు ఇండస్ట్రీలో అందరూ చర్చించుకుంటున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లను మూసేసి నిరసనకు దిగడం ఎంత వరకు సబబు.. ఇది అసలు సాధ్యమేనా అనే చర్చ జరుగుతోంది. ఇండస్ట్రీ ప్రస్తుతం అసలే స్లంప్‌లో ఉంది. వేసవిలో సరైన సినిమాలు పడక బాక్సాఫీస్‌లో ఊపు కనిపించలేదు. సమ్మర్ సీజన్ వేస్టయిన ఫీలింగ్ కలుగుతోంది. అంతో ఇంతో ఆశలు కలుగుతోంది జూన్ సినిమాల మీదే. థగ్ లైఫ్, హరిహర వీరమల్లు, కుబేర, కన్నప్ప లాంటి ప్రామిసింగ్ సినిమాలు ఈ నెలకు షెడ్యూల్ అయ్యాయి.

అందులోనూ పవన్ సినిమా ‘హరి హర వీరమల్లు’ అన్నింటికంటే కీలకమైంది. ఇది పవన్‌కు, నిర్మాతలకు ఎంతో కీలకమైన సినిమా. ఇటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు ఇది ఎంతో ముఖ్యమైంది. ఎన్నోసార్లు వాయిదా పడి ఎట్టకేలకు జూన్ 12న విడుదల కాబోతోంది ఈ చిత్రం. పైగా ప్రస్తుతం పవన్ ఏపీ డిప్యూటీ సీఎం కూడా. ఇలాంటి సినిమా రిలీజ్ ఉండగా.. థియేటర్లు మూసేసి నిరసన పాటిస్తారా అన్నది ప్రశ్నార్థకం. చాన్నాళ్ల తర్వాత ఫ్యాన్స్ షోలతో హోరెత్తించాలని అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు ఎదురు చూస్తున్న సినిమా ఇది. ఇలాంటి స్థితిలో ఎగ్జిబిటర్లు ఆందోళన బాట పట్టడం ఆశ్చర్యకరం. వాళ్ల నిరసనకు ఇది సరైన సమయం కాదని.. ఏదైనా చర్చలతో పరిష్కారించుకోవాలి తప్ప థియేటర్లను మూసేసే పరిస్థితి రావడం ఎవరికీ మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.